Delhi Anjali Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంజలి(20) పోస్టుమార్టం రిపోర్టులో ఒళ్లు జలదరించే విషయాలు బయటకు వచ్చాయి. ఆమె మరణం ఎంత వేదనతో కూడుకున్నదో పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
కారు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లడంతో అంజలి శరీరానికి 40 చోట్ల గాయాలయ్యాయి. ఆమె మెదడు ఇంకా దొరకలేదు. కారు ఈడ్చుకుపోవడంతో ఆమె తల పగిలిపోయింది. రక్తస్రావం విపరీతంగా జరిగింది. శరీరంలోని పక్కటెముకలు బయటకు వచ్చాయి. ఊపిరితిత్తులు వెనుకవైపు నుంచి బయటకు కనిపిస్తున్నాయి. కారు రోడ్డుపై ఈడ్డుకుపోవడంతో ఆ వేడికి శరీరం మొత్తం కమిలిపోయింది.
తల, వెన్నుముక, ఎడమ తొడ ఎముకలు, ఇతర అవయవాలకు గాయాలు, రక్తస్రావంతో యువతి చనిపోయిందని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఈ వివరాలను మృతురాలి బంధువు వెల్లడించారు. ప్రమాద సమయంలో అంజలి మద్యం తాగి ఉందన్న ఆమె స్నేహితురాలు నిధి ఆరోపణలను అంజలి బంధువులు తోసిపుచ్చారు. పోస్టుమార్టం నివేదికలో అంజలి మద్యం సేవించలేదని తేలిందన్నారు. ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని తెలిపారు. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో నిన్న పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం అంజలి మృతదేహాన్ని ఆమె నివాసానికి తరలించారు. నిన్న సాయంత్రం అంజలి అంత్యక్రియలు ముగిశాయి.
Also Read..Delhi: మహిళను ఢీకొని 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన కారు.. మహిళ మృతి
ఢిల్లీలోని కంజావాలా ప్రాంతంలో అంజలి అనే యువతి కారు ప్రమాదంలో మరణించింది. ఈ దుర్ఘటనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసే అంజలి డిసెంబర్ 31న రాత్రి ఫ్రెండ్స్తో న్యూఇయర్ సెలెబ్రేషన్స్కు వెళ్లింది. జనవరి 1న తెల్లవారుజామున 1.45 గంటలకు నిధి అనే స్నేహితురాలితో కలిసి స్కూటీపై ఇంటికి బయలుదేరింది.
వారి స్కూటీ కంజావాలాలోని సుల్తాన్పురి ఏరియాకు రాగానే మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో నిధి ఎగిరి పక్కన పడగా.. అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయినా కారును ఆపలేదు. అలాగే అంజలిని కారుతో ఈడ్చుకెళ్లారు. అలా 12 కిలోమీటర్లు వెళ్లారు. చివరికి ఓ యూటర్న్ దగ్గర కారులోని వ్యక్తులు అంజలి బాడీని గుర్తించారు. ఈ అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. నిందితుల్లో ఒకరు బీజేపీ నేత కుటుంబానికి చెందినవాడని ప్రచారం జరుగుతోంది. అతడిని తప్పించేందుకు ఆ నేత ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.