Kharkiv : యుక్రెయిన్ లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్ లో(kharkiv) పరిస్థితులు దిగజారిపోయాయి. ఖార్కివ్ లోకి ప్రవేశించిన రష్యా బలగాలు.. దాడులు ముమ్మరం చేశాయి. ఖార్కివ్ లో పరిస్థితులు దిగజారడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఖార్కివ్ నగరంలో భారతీయ పౌరుల భద్రత, రక్షణ.. ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని కేంద్రం తెలిపింది. ఖార్కివ్ సహా ఘర్షణ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల సురక్షితమైన తరలింపు గురించి రష్యన్, యుక్రెయిన్ ఎంబసీలతో భారత విదేశాంగ శాఖ అధికారులు మాట్లాడారు.
ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా, ఉక్రెయిన్, ఢిల్లీలోని రాయబారులు, ప్రతినిధులు శాంతిగా ఉండాలని భారత్ సూచించింది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యాలోని బెల్గోరోడ్ నగరంలో భారత అధికారులను కేంద్రం అందుబాటులో ఉంచింది. ఖార్కివ్ సమీప నగరాల్లో చుట్టుపక్కల ఉన్న యుద్ధ వాతావరణంతో భారతీయుల తరలింపులో అడ్డంకులు ఎదురవుతున్నాయి. రష్యా, యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపునకు ప్రతి స్పందించడం అత్యవసరమని కేంద్రం తెలిపింది.
యుద్ధ ప్రమాదం లేని చోట్ల ఇప్పటికే భారత పౌరులను కేంద్రం ఖాళీ చేయించగలిగింది. యుద్ధం మొదలు కాక నుంచి ఇప్పటివరకు 9000 మంది భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుండి తరలించింది కేంద్రం. ఇంకా యుక్రెయిన్లో అనేకమంది భారతీయులు చిక్కుకుపోయారు. వారందరిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని కేంద్రం తెలిపింది.
Indian Student: రష్యా బాంబు దాడిలో భారత విద్యార్థి మృతి
యుక్రెయిన్లోని సైనిక స్థావరాలను మాత్రమే తాము లక్ష్యంగా చేసుకుంటున్నామని రష్యా చెబుతుండగా.. ఉక్రెయిన్ వాదన మరోలా ఉంది. సైనిక స్థావరాలేవీ లేని చోట, జనావాసాల పైనా రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయని యుక్రెయిన్ ఆరోపించింది. కనిపించిన ప్రతిదానిని ఆక్రమణదారులు లక్ష్యంగా చేసుకున్నారని, ఆఖరికి అంబులెన్సులనూ వదల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెనలు, స్కూళ్లపైనా దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
యుక్రెయిన్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఖార్కివ్(kharkiv) నగరంపై రష్యా మిస్సైల్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఖార్కివ్లో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్పై ఈ దాడి జరిగింది. మంగళవారం ఉదయం ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. నగరంలోని ఫ్రీడమ్ స్క్వేర్ దగ్గరున్న ప్రభుత్వ ఆఫీసులను రష్యా సేనలు టార్గెట్ చేశాయి. మిస్సైల్ దాడితో ఆ ప్రాంతంలో భారీ పేలుడు, మంట చెలరేగింది. సమీపంలో ఉన్న బిల్డింగ్, కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఉదయం 8 గంటలకు దాడి జరిగినట్లు చెబుతున్నారు. యుక్రెయిన్లో రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్. ఆ నగరంలో సుమారు 16 లక్షల మంది జనాభా ఉన్నట్లు అంచనా.
యుక్రెయిన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని చెబుతున్న రష్యా… ఆ దిశగా దాడులు ముమ్మరం చేసింది. గత కొన్నిరోజులతో పోల్చితే మంగళవారం (మార్చి 1) భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. రష్యా తన సైన్యంలో సగం బలగాలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా తరలిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో యుక్రెయిన్ లోని ఇతర నగరాలను కూడా చేజిక్కించుకునేందుకు రష్యా బలగాలు భీకర దాడులు జరుపుతున్నాయి.
Ukraine Russia War : యుక్రెయిన్పై వెనక్కి తగ్గని పుతిన్.. ఆ ధైర్యం ఇచ్చింది ఇతడేనట..!
యుక్రెయిన్ పై యుద్ధోన్మాదంతో పేట్రేగిపోతూ రష్యా జరుపుతున్న దాడుల్లో యుక్రెయిన్ సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై మంగళవారం నాటికి ఆరు రోజులు. మంగళవారం ఉదయం యుక్రెయిన్పై రష్యా జరిపిన బాంబు దాడుల్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థిని కర్ణాటకకు చెందిన నవీన్గా గుర్తించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది.
వైద్య విద్య కోసం భారత్కు చెందిన వేలాది మంది విద్యార్థులు యుక్రెయిన్కు వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది విద్యార్థులు కూడా మెడిసిన్ చదివేందుకే యుక్రెయిన్ వెళ్లారు. మృతుడు నవీన్ కూడా వైద్య విద్య కోసమే యుక్రెయిన్ వెళ్లాడు. అయితే మంగళవారం ఉదయం రష్యా సేనలు జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు.