Turkey Earthquake : టర్కీలో భూప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకు వందసార్లకు పైగా భూమి కంపించింది. నిన్న 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాతి నుంచి ప్రకంపనలు ఆగడం లేదు. రిక్టర్ స్కేల్ పై 4 అంతకంటే తీవ్ర స్థాయిలో వందసార్లకు పైగా భూమి కంపించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది.
తొలుత భారీ భూకంపం వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా 5 నుంచి 6 తీవ్రతతో మరికొంత కాలం పాటు ఈ ప్రకంపనలు రావొచ్చని వారు పేర్కొన్నారు. వీటి ప్రభావంతో ఇప్పటికే దెబ్బతిన్న భవనాలు కూలవచ్చని తెలిపారు. దీంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Also Read..Earthquakes In Turkey, Syria : శవాల దిబ్బగా టర్కీ, సిరియా.. 4,500 దాటిన మృతుల సంఖ్య
మధ్యదరా సముద్రంలో ఉన్న టర్కీ కీలక నగరం ఇసకెండరన్ లోని లిమాక్ పోర్ట్ భూకంపం తీవ్రతకు తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ కంటైనర్స్ ను ఉంచిన ప్రదేశంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. టర్కీలోని విద్యుత్ వ్యవస్థ, సహజ వాయు పైపు లైన్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ రంగ పైప్ లైన్ ఆపరేటర్ బోటాస్ దీనిపై ఒక కీలక ప్రకటన చేసింది.
గాంజియాన్ టెప్, హతె, కహ్రమన్ రాస్ ఫ్రావిన్స్ లకు పైప్ లైన్ లో గ్యాస్ సరఫరా ఆపివేసింది. కహ్రమన్ రాస్ లోని పైప్ లైన్ భూకంప కేంద్రానికి అత్యంత సమీపంగా ఉండటంతో తీవ్రంగా దెబ్బతిందని చెప్పింది. విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతింది. దీంతో ఆసుపత్రులకు, ఆహారశాలలకు, గ్యాస్ సరఫరా వ్యవస్థలకు విద్యుత్ ను అందించే అత్యవసర చర్యలు చేపట్టారు. తమ మొబైల్ విద్యుత్ ప్లాంట్లను ఆయా ప్రదేశాలకు పంపినట్లు టర్కీ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ పేర్కొంది. అక్యుయు అణు విద్యుత్ కేంద్రానికి ఎటువంటి నష్టం వాటిల్ల లేదని ప్రభుత్వం వెల్లడించింది.
భారీ భూకంపాలతో కకావికలమైన టర్కీ, సిరియాలకు భారత్ ఆపన్నహస్తం అందించింది. భారత్ నుంచి సహాయక బృందాలు టర్కీ చేరుకున్నాయి. ఇవాళ ఉదయం వాయుసేనకు చెందిన విమానంలో టర్కీ అదానీ ఎయిర్ పోర్టుకు 50మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రత్యేక డాగ్ రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. సహాయక సామాగ్రితో సీ-17 రెండో విమానం కూడా టర్కీకి బయలుదేరింది. అలాగే, వైద్య సామాగ్రి, మందులతో సీ-130 విమానం డెమాస్కస్ కు చేరుకోనుంది. వైద్య సహాయక సిబ్బందితో మరో రెండు సీ-17 విమానాలు కూడా టర్కీ వెళ్లనున్నట్లు కేంద్రవర్గాలు తెలిపాయి.