Bengal Trader : కొన్ని నెలల క్రితం తమిళనాడుకు చెందిన ఒక యువకుడు 10 రూపాయల నాణేలు చెల్లించి కారు కొన్న సంఘటన మనకు తెలుసు. తాజాగా పశ్చిమబెంగాల్ కు చెందిన యువకుడు రూపాయి, రెండు రూపాయల కాయిన్స్ చెల్లించి బైక్ కొని వార్తల్లో నిలిచాడు. పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలోని సుబ్రతా సర్కార్(46) బీడీలు తయారు చేసి షాపులకు అమ్ముతూ ఉంటాడు.
2016 నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం రూ.500. రూ. 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఆసమయంలో నోట్ల కొరత వల్ల చాలామంది వ్యాపారస్తులు అతడి వద్ద బీడీలు కొనుగోలు చేసి చిల్లర నాణేలు ఇచ్చేవారు. అయితే భవిష్యత్తులో ఎప్పుడో అప్పుడు ఉపయోగపడతాయిలే అని అతను అవి తీసుకుని వారికి సరుకు ఇచ్చేవాడు.
అలా సుబ్రతా సర్కార్ వద్ద బస్తాల కొద్దీ నాణేలు పేరుకు పోయాయి. ఆ చిల్లరలో ఎక్కువగా రెండు రూపాయల నాణేలు ఉన్నాయి. కాగా ఇటీవల సుబ్రతో ఒక బైక్ కొనాలి అనుకున్నాడు. తన వద్ద ఉన్న నాణేలతో బైక్ ఎందుకు కొనకూడదనుకున్నాడు. ఇంటికి వచ్చి తన 17 ఏళ్ల కుమారుడు శేఖర్ కు ఈ విషయం చెప్పాడు.
ఆరేళ్లుగా ఇంట్లో దాచి పెట్టిన మొత్తం నాణేలను లెక్కపెట్టారు. అది 1లక్షా 80 వేల రూపాయలు ఉంది. శేఖర్ ఒక బైక్ షోరూమ్ డీలర్ ను సంప్రదించాడు. నాణేలతో బైక్ కొనుగోలు చేస్తామని చెప్పాడు. అందుకు వారు అంగీకరించారు. దీంతో సుబ్రతా కుటుంబ సభ్యులు నాణేలను మూటలుగా కట్టారు.
మంగళవారం ఆ బస్తాలను అన్నీ ఆటోలో బైక్ షోరూంకు తీసుకు వెళ్ళారు. అయితే చిల్లర లెక్కించేందుకు ఐదుగురు సిబ్బందికి మూడు రోజులు సమయం పట్టింది. శుక్రవారంతో లెక్క పూర్తవటంతో వారు శేఖర్ కి బైక్ కీ, పత్రాలు అందచేశారు. సుబ్రతో మొత్తం ఒక లక్షా 50 వేల రూపాయలకు నాణేలు ఇచ్చాడని బైక్ షోరూం మేనేజర్ తెలిపారు.
Also Read : Bride On Boat : వరదల్లో పెళ్లి-పడవలో పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లిన వధువు