Corona Vaccine : దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ఫ్రీగా వేసినా.. కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడదా? ఒకవేళ కేంద్రానికి భారం అవుతుందనుకుంటే రాష్ట్రాలతో కలిసి షేర్ చేసుకుంటే సరిపోతుందా? మొత్తం అందరికీ వ్యాక్సిన్ ఉచితంగానే అందించినా దేశం జీడీపీలో ఒక్కశాతం లోపే అని చెబుతున్నారు నిపుణులు.
కొవిడ్ విజృంభిస్తున్న వేళ.. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ చేయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. రాష్ట్రాలు కావాలనుకుంటే ఉచితంగా ఇచ్చుకోవచ్చు. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో అందరికీ వ్యాక్సినేషన్ అంటే భారీ ఎత్తున ఖర్చవుతుందని అంచనాలు వేశారు. కానీ, వాస్తవానికి ఆ ఖర్చంతా చూస్తే దేశ జీడిపీలో ఒక్క శాతం కూడా ఉండడం లేదు.
అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుందనే దానిపై అన్ని రాష్ట్రాల్లో లెక్కలు వేసుకుంటున్నారు. కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా దేశంలోని 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినా.. 67వేల 193 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని లెక్కలేశారు. దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా.. అందులో 18 ఏళ్లు నిండిన వాళ్లు 84.2 కోట్ల మంది ఉంటారని అంచనా. వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేస్తే.. కేంద్రంపై 20వేల 880 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలపై 46వేల 300 కోట్ల రూపాయల భారం పడనుందని ది ఇండియన్ రేటింగ్స్ స్టడీ అంచనా వేసింది.
బుధవారం వ్యాక్సిన్ల ధరలు ప్రకటించినందున ఈ వ్యయాన్ని అంచనా వేసినట్లు అధ్యయనం తెలిపింది. వ్యాక్సినేషన్ కోసం అయ్యే మొత్తం ఖర్చు దేశ వార్షిక జీడీపీలో కేవలం 0.36 శాతమేనంది. ఇది పెద్ద మొత్తమేం కాదని స్టడీ తెలిపింది. ఒకవేళ ఇంత మొత్తం భారమనుకుంటే కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటే సరిపోతుందని సూచించింది. కేంద్ర బడ్జెట్ జీడీపీలో 0.12 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 0.264 శాతం భారం ఉంటుందని ఇండియన్ రేటింగ్స్ పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భారత ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రతికూల ప్రభావం కంటే ఇది చాలా చిన్న మొత్తమేనని ఇండియా రేటింగ్ తెలిపింది.
అధ్యయనం ప్రకారం, గరిష్ట ప్రభావం బీహార్ స్థూల రాష్ట్ర జీఎస్డీపీపై 0.60 శాతంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ 0.47 శాతం, జార్ఖండ్ 0.37 శాతం, మధ్యప్రదేశ్ 0.30 శాతం, ఒడిశా 0.30 శాతంగా ఉంటుందని తెలిపింది. వ్యాక్సిన్ల మొత్తం అవసరాల్లో, 21 కోట్ల 40 లక్షల డోస్లను సేకరించడానికి ఇప్పటికే 509 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 155 కోట్ల 40లక్షల డోస్లను సేకరించడానికి 62వేల 103 కోట్ల రూపాయల ఖర్చవుతుంది.
కొవిడ్ -19 వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్ 12-18 నెలల వరకు ఉండే అవకాశం ఉన్నందున ఇది కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లపై పునరావృతమయ్యే ఖర్చు అని అధ్యయనం సూచించింది. కేరళ, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేసే ఖర్చును తాము భరిస్తామని ఇప్పటికే ప్రకటించాయి.
Read More : Corona : తెలుగు రాష్ట్రాల సచివాలయాల్లో కరోనా..హఢలిపోతున్న ఉద్యోగులు