Herchelle Gibbs
Herchelle Gibbs – ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచ కప్-2023 వేళ టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉందని దక్షిణాఫ్రికా (South Africa) మాజీ క్రికెటర్ హెర్చెల్ గిబ్స్ అన్నారు. టీమిండియా ఐసీసీ ప్రపంచ కప్-2011 గెలుచుకున్న విషయం తెలిసిందే. దానితో పాటు 2013లో ఇంగ్లండ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy-2013)ని కూడా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోనే టీమిండియా గెలుచుకుంది.
కొన్ని నెలల్లో భారత్లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023 జరగనుంది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2011 కూడా భారత్ లోనే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెర్చెల్ గిబ్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ” భారత్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఒత్తిడిలోనూ ఆడే గొప్ప క్రికెటర్లు టీమిండియాలో ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితులు భారత్కు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను. ఎందుకంటే, ఉప ఖండం ఉన్న పరిస్థితుల్లో సమర్థంగా ఆడే జట్లు చాలా ఉన్నాయి. ఇది చాలా ఉత్సాహాన్నిచ్చే టోర్నమెంట్” అని చెప్పారు.
ఐసీసీ వన్డే పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. చెన్నైలో అక్టోబర్ 8న భారత్ తొలి మ్యాచు ఆస్ట్రేలియాతో ఆడనుంది. 2011లో భారత్ లో జరిగిన టోర్నమెంట్లో టీమిండియా కప్ గెలుచుకుంది. దీంతో ఈ సారి కూడా భారత్ గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.