Karnataka: చాలా కాలంగా బిల్లు కట్టకపోవడంతో విద్యుత్ బిల్లు 10 వేల రూపాయలకు చేరింది. అయితే బిల్లు కట్టడం లేదని కనెక్షన్ తొలగించేందుకు వచ్చిన విద్యుత్ శాఖ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. ఆయనతో గొడవ పెట్టుకుని చెప్పుతో పలుమార్లు కొట్టాడు. అంతే కాకుండా, ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిని కూడా బెదిరించాడు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జరిగిందీ ఘటన. కాగా, విద్యుత్ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
దాడికి పాల్పడ్డ వ్యక్తి కొప్పల్లోని కూకనపల్లికి చెందిన చంద్రశేఖర్ హిరేమత్. గత 6 నెలలుగా కరెంటు బిల్లు 9,990 రూపాయలు చెల్లించలేదని విద్యుత్ శాఖ పేర్కొంది. అయితే ఈ బిల్లు వసూలు చేసేందుకు గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (జెస్కామ్)కు చెందిన మంజునాథ్ అనే ఉద్యోగి హిరేమత్ ఇంటికి బిల్లు తీసుకునేందుకు వెళ్లగా.. చెల్లించేందుకు హీరేమత్ నిరాకరించాడు. దీంతో మంజునాథ్ విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు ప్రయత్నించగా, ఆగ్రహించిన హిరేమత్ అతనిపై దాడి చేశాడు.
Police case registered against a consumer in #Koppal district after he
refuses to pay bills & attacked #GESCOM official.#Munirabad police take up the case#ElectricityBill #Karnataka #india #viral #viralvideo pic.twitter.com/lkH14vumBb— Siraj Noorani (@sirajnoorani) May 24, 2023
ఆ సమయంలో అక్కడే ఉన్న మంజునాథ్ సహచరుడు ఘటనను కెమెరాలో రికార్డు చేశాడు. హిరేమత్ మంజునాథ్ను చెంపదెబ్బ కొట్టడం, అతనిపై నిరంతరం దెబ్బలు వేయడం, బెదిరించడం వీడియోలో చూడొచ్చు. మరో అధికారిపై కూడా హిరేమత్ చెప్పు విసిరాడు. అయితే ఎన్నికలకు ముందు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో చాలా మంది బిల్లు చెల్లించేందుకు ఇష్టపడడం లేదని స్థానికులు అంటున్నారు.