Narendra Modi Stadium క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న రాజీవ్ ఖేల్రత్న పేరును..హాకీ లెజెండ్ “మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న”గా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో నెటిజన్లు,ప్రముఖులు స్వాగతించారు. ఇకపై క్రీడా పురస్కారాలన్నింటికి.. రాజకీయనేతల పేర్లు కాకుండా క్రీడాకారుల పేర్లే పెట్టాలన్నారు. అయితే కొందరు నెటిజన్లు,విపక్ష నేతలు కేవలం అవార్డుల పేర్లే కాదు.. స్టేడియాల పేర్లు కూడా మార్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు .
రాజీవ్ ఖేల్రత్న పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నగా మార్చి గొప్ప నిర్ణయం తీసుకున్న మోదీ ప్రభుత్వం.. అదే స్ఫూర్తితో నరేంద్రమోదీ స్టేడియం, జైట్లీ స్టేడియం పేర్ల వాటిస్థానంలో క్రీడాకారుల పేర్లు పెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. గుజరాత్ మాజీ సీఎం శంకర్ సిన్హ్ వాఘేలా సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారు. వాఘేలా ఓ ట్వీట్ లో..ఈ మార్పు చేసిన మీరే.. నరేంద్రమోదీ స్టేడియంకి తిరిగి సర్దార్ పటేల్ స్టేడియంగా మార్చాల్సిందిగా కోరుతున్నా అని పేర్కొన్నారు.
కాగా,ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియం(మోతెరా స్టేడియం అని కూడా పిలుస్తారు)పేరుని 2020 ఫ్రిబవరిలో ‘నరేంద్ర మోదీ స్టేడియం’ గా మార్చిన విషయం తెలిసిందే. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షత వహించినందుకు గానూ మోదీకి ఈ గుర్తింపు ఇచ్చినట్లు అప్పట్లో తెలిపారు.