Producer TG Vishwa Prasad mother TG Geetanjali passes away in Varanasi
TG Geetanjali : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ తల్లి శ్రీమతి టిజి గీతాంజలి కన్నుమూశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఇటీవల వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొడుతున్నారు టి.జి.విశ్వ ప్రసాద్. త్వరలో రాబోయే పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కూడా ఈయనే తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో దాదాపు 10 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
ప్రస్తుతం టి.జి.విశ్వ ప్రసాద్ మంచి ఫామ్ లో ఉన్నారు పరిశ్రమలో. ఇలాంటి సమయంలో ఆయన మాతృమూర్తి మరణించారు. గత కొంతకాలంగా ఆవిడ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.
అయితే కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం 70 ఏళ్ళ వయసులో నేడు సాయంత్రం 6.10 నిమిషాలకు కన్నుమూశారు. గీతాంజలి గారికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ గారు పెద్దకొడుకు. వారణాసిలోనే ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు. కాశీలోని కన్నుమూయడం ఆమెచేసుకున్న అదృష్టం, చివరి కోరిక కూడా తీరింది అని అంటూ పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.