Raja Singh: హైదరాబాద్ పేరే కాదు తెలంగాణలో అనేక ప్రాంతాల పేర్లను మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెట్టిందంటూ ప్రాపగండా చేస్తున్నారని, అనవసర ప్రాపగండ చేయాల్సిన అవసరం లేదని, మేం అధికారంలోకి వచ్చాక బరాబర్ భాగ్యనగరంగా హైదరాబాద్ పేరును మారుస్తామని అన్నారు రాజాసింగ్.
భారతీయ జనతాపార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, యూపీ సీఎం యోగీ కూడా దీనిపై ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఒక్క భాగ్యనగరం పేరేకాదు సికింద్రబాద్, కరీంనగర్, నిజమాబాద్లతో పాటు మిగతా నగరాల పేర్లూ మారుస్తామని అన్నారు రాజాసింగ్.
నిజాం సర్కార్ బలవంతంగా మార్చిన పేర్లను అన్నింటినీ తిరిగి మారుస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుందని, వచ్చిన వెంటనే పేర్లు మారుస్తామని అన్నారు. నిజాం దౌర్జాన్యాన్ని ప్రజల ముందు పెట్టి, నిజాం కట్టడాలను ధ్వంసం చేస్తామని అన్నారు. దేశంకోసం అమరులైన వారి పేరును జిల్లాలకు పెడతామని అన్నారు.