Tamil Nadu chief minister M K Stalin: తనదైన శైలిలో పాలన చేస్తూ ముందుకు సాగుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. పోలీసుల డిమాండ్లు మరియు అవసరాలను తెలుసుకోవడానికి రాష్ట్రంలో కొత్త పోలీస్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో మానవతా దృక్పదంతో, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై జన్మదినమైన సెప్టెంబర్ 15న సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న 700మంది జీవిత ఖైదీలను విడుదల చేయనుంది ప్రభుత్వం.
పోలీసుల కోసం, పోలీసుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి.. రిస్క్ అలవెన్స్ను రూ.800 నుంచి రూ.1000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న 1132 మంది పోలీసు వారసులకు కారుణ్య ప్రాతిపదికన వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు పని చేస్తున్న జిల్లాలో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఇందుకోసం ప్రత్యేక గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
కానిస్టేబుళ్ళు, హెడ్కానిస్టేబుళ్లు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనువుగా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వనున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం పోలీసులకు మాత్రమే ఏటా ఉచితంగా సమగ్రమైన వైద్యపరీక్షలు చేయించుకునే అవకాశం ఉండగా.. ఇకపై వారి భార్యలకు కూడా వైద్యపరీక్షలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి. పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు రూ.25లక్షలతో ప్రత్యేక యాప్ను రూపొందించనున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి.
చెన్నై థౌజండ్లైట్స్ ప్రాంతంలో రూ.275 కోట్లతో పోలీసు క్వార్టర్స్ను నిర్మించనున్నట్లు చెప్పిన ముఖ్యమంత్రి, ఆవడి, తాంబరం కార్పొరేషన్లలో కొత్త పోలీసు కమిషనర్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు సీఎం స్టాలిన్. పోలీసు క్యాంటీన్లలో విక్రయిస్తున్న వస్తువులపై జీఎస్టీ మినహాయింపుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి. పోలీసుల పదోన్నతి కాలపరిమితిని నిర్ణయించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, మెరీనాబీచ్లో ప్రత్యేక ప్రాణ రక్షక దళం ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో కొత్తగా పది పోలీస్ స్టేషన్లను ఏర్పాట్లు చెయ్యనున్నట్లు ప్రకటించారు.