Bus Falls Into Gorge
Uttarakhand : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హర్యానా నుంచి వస్తున్న బస్సు ఆదివారం రాత్రి నైనిటాల్లో ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ఈ దుర్ఘటనలో హర్యానాకు చెందిన ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. నైనిటాల్ జిల్లా కలాధుంగి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన పర్యాటకులను తీసుకువెళుతోంది.
Also Read : Telangana Assembly Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 72గంటల్లో ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల
నైనిటాల్ జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి అందిన సమాచారం ప్రకారం పర్యాటకులు నైనిటాల్ సందర్శించి తిరిగి వస్తుండగా వారి బస్సు కలదుంగిలోని నల్ని ప్రాంతంలో 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని కాలువలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి క్షతగాత్రులను గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.