Lakhimpur Kheri case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటన కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాను.. నిన్న 12 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. రైతులను కార్లతో తొక్కించడంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆశిష్ మిశ్రా మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని సిట్ అరెస్ట్ చేసింది. ఆశిష్ మిశ్రా విచారణకు ఏమాత్రం సహకరించలేదని పోలీసులు వెల్లడించారు.
లఖింపూర్లోని క్రైంబ్రాంచ్ కార్యాలయంలో ఆశిష్ను పోలీసులు 40 ప్రశ్నలు అడిగారు. ఈ నెల 3న జరిగిన ఘటనపై ఆరుగురు సభ్యుల సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ రోజు మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో ఎక్కడున్నావని ప్రశ్నించారు. మెజిస్ట్రేట్ సమక్షంలో ఈ విచారణ జరిగింది. వాహనంలో తాను లేనని, గ్రౌండ్లో ఉన్నట్లు చెప్పిన ఆశిష్.. తన తరపున పలు వీడియోలు, 10 మంది సాక్షుల అఫిడవిట్ను అధికారులకు సమర్పించాడు.
MP Varun Gandhi : ఇవి ముమ్మాటికీ హత్యలే.. లఖింపూర్ వీడియో షేర్ చేసిన బీజేపీ ఎంపీ
రైతులపై నుంచి వాహనాలు నడపంతో నలుగురు రైతులు మృతి చెందారు. రైతులను హత్య చేసిన కేసులో పోలీసులు ఆశిష్ మిశ్రాకు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకాకపోవడంతో.. మరోసారి నోటీసులు ఇచ్చారు. దీంతో శనివారం విచారణకు హాజరయ్యాడు. సుదీర్ఘంగా విచారించిన తర్వాత రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హైడ్రామా నెలకొంది. ఆశిష్ మిశ్రాను మీడియా కంటపడకుండా తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయనను కారులో తరలించారు.