Jama Masjid: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న జామా మసీదు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, బాలికలను మసీదులోకి ప్రవేశంపై నిషేధం విధించింది. అయితే ఇది పూర్తిగా కాదు కానీ, ఎవరైనా మగ తోడు ఉంటే మాత్రం లోపలికి అనుమతి ఉంటుందట. ఈ విషయమై కొద్ది రోజుల క్రితమే మసీదు ప్రవేశం ద్వారం వద్ద నోటీసులు అంటించారు జామా మసీదు నిర్వహణ సంఘం.ఈ నోటీసు ప్రకారం.. మసీద్ ప్రాంగణంలోకి ప్రవేశించాలనుకునే మహిళలు వారి కుటుంబంలోని పురుషులను వెంటబెట్టుకుని రావాలి. లేదంటే మసీదు ప్రాంగణంలోకి అనుమతి ఉండదు.
అయితే జామా మసీదు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మానవ హక్కులకు విఘాతం కల్పించడమేనని ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. పబ్లిక్ స్థలాల్లోకి ఎవరి ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై జామా మసీదు నిర్వహణ సంఘానికి నోటీసులు జారీ చేయనున్నట్లు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ గురువారం తెలిపారు. అయితే ఈ విమర్శలపై జామా మసీదు సమాధానం ఇచ్చింది. ప్రార్థనల కోసం వచ్చినవారికి ఇబ్బందికలిగించేలా సోషల్ మీడియా కోసం మహిళలు వీడియోలు షూట్ చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మసీద్ పీఆర్వో సబివుల్లా ఖాన్ అన్నారు.