రాహుల్ గాంధీ: 2024 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారట. ఈ సూచన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన అజయ్ రాయ్ శుక్రవారం ధృవీకరించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఆయన అన్నారు. ఇక ప్రియాంక గాంధీ వాద్రా పోటీ గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆమె కోరుకుంటే వారణాసి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. వారి కోసం పార్టీలోని ప్రతి కార్యకర్త తమ ప్రాణాలను అర్పిస్తారని కూడా అన్నారు. అయితే రాహుల్ గాంధీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ధారణ జరగలేదు.
యూపీలోని అమేథీ కాంగ్రెస్కు కంచుకోటగా నిలిచింది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో (యూపీలోని అమేథీ, కేరళలోని వాయనాడ్) నుంచి పోటీ చేశారు. అమేథీలో రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా, వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ కనీవినీ ఎరుగని మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈసారి మళ్లీ అమేథీ నుంచి రాహుల్ పోటీ చేస్తే స్మృతి ఇరానీని ఓడిస్తారా అనేది అత్యంత ప్రాధాన్యతగా మారే అవకాశం ఉంది.
యూపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే అజయ్రాయ్ను కాంగ్రెస్ హైకమాండ్ గురువారం నియమించింది. ఆయన బ్రిజ్లాల్ ఖబ్రీ స్థానంలో వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేయడంపై పలు ఊహాగానాలు వచ్చాయి. అంతకు ముందు ఆ ఎన్నికల్లో ప్రధాని మోదీపై అజయ్రాయ్ పోటీ చేశారు. అయితే రెండు సార్లు ఆయనకు ఘోర పరాజయం ఎదురైంది.