Gaganyaan TV-D1
TV D1 ISRO: మొన్న చంద్రయాన్-3.. నిన్న ఆదిత్య ఎల్-1 గ్రాండ్ సక్సెస్తో ప్రపంచ దృష్టి భారత్ వైపునకు తిప్పుకునేలా చేసిన ఇస్రో ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక మిషన్కు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లేందుకు ఇస్రో చేపట్టిన గగన్యాన్ మిషన్లో శనివారం తొలి పరీక్ష చేపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్లో శనివారం ఉదయం 8 గంటలకు ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 స్పేస్క్రాఫ్ట్ పరీక్ష చేయనున్నారు. ఈ ప్రయోగం పూర్తి కావడానికి మొత్తం 8.5 నిమిషాల వ్యవధి పడుతుంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరును పరీక్షించడానికి దీన్ని చేపడుతున్నట్లు ఇస్రో తమ వెబ్సైట్లో పేర్కొంది.
ఇందుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపింది. ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 స్పేస్క్రాఫ్ట్ ను నింగిలోకి పంపి, క్రూ మాడ్యూల్ ను సముద్రంలో పడేలా చేస్తారు. అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే ప్రయోగంలో లోపం తలెత్తి ప్రయోగం విఫలమైతే దాని నుంచి వ్యోమగాములను సురక్షితంగా తప్పించేందుకు సంసిద్ధత కోసం ఈ పరీక్షను చేపడతారు.
ఇస్రో దాదాపు 20 పరీక్షలు చేసి, ఆ తర్వాత గగన్యాన్ మిషన్ చేపడుతుంది. ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 స్పేస్క్రాఫ్ట్ క్రూ మాడ్యూల్ తో పాటు క్రూ ఎస్కేప్ సిస్టమ్ను 17 కిలో మీటర్ల ఎత్తువరకు మోసుకెళ్లాక అబార్ట్ సిగ్నల్ను పంపిస్తారు. ఎస్కేప్ సిస్టమ్ సమర్థంగా పనిచేస్తే క్రూ మాడ్యూల్ విడిపోయి, పారాచూట్ సాయంతో సముద్రంలో పడిపోతుంది. అనంతరం దాన్ని నేవీ సిబ్బంది బయటకు తీసుకొస్తారు.
Also Read:
Chandrayaan-3: జాబిల్లిపై మన ల్యాండర్, రోవర్కి పొంచి ఉన్న ముప్పు.. ఏం జరుగుతుందో తెలుసా?