Balineni Srinivasa Reddy : వైసీపీలో కలకలం రేగింది. మరోసారి అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. మరో సీనియర్ నేత, మాజీమంత్రి సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రావు ఈసారి ఓపెన్ అయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై విరుచుకుపడ్డారు. నిందలు భరించలేకపోతున్నా అంటూ.. ప్రెస్ మీట్ లో కంటతడి పెట్టారు.
తన వెనుక కుట్ర జరుగుతోందని, సొంత పార్టీ వాళ్లే ఈ కుట్రలు చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. కుట్రలు చేస్తున్న వారు ఎవరో కూడా తనకు తెలుసన్నారు. అయితే, పార్టీకి కట్టుబడి ఉన్నందు వల్ల తనపై చేస్తున్న కుట్రల వెనకాల ఉన్న వ్యక్తుల పేర్లు వెల్లడింఛలేకపోతున్నాను అని బాలినేని అన్నారు. తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు, అనుచరుల కోసం ఎటువంటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానని బాలినేని హాట్ కామెంట్స్ చేశారు.(Balineni Srinivasa Reddy)
నమ్ముకున్నోళ్లకు న్యాయం చేస్తుంటే నిందలు వేస్తారా?- బాలినేని
” 1987లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా మెదలైన నా రాజకీయ ప్రస్థానంలో ఎక్కడైనా విలువలతో కూడిన రాజకీయాలు చేశాను. ఎక్కడా తప్పు చేయలేదు. వైఎస్ఆర్ పెట్టిన రాజకీయ భిక్ష వల్లే నేను ఎమ్మెల్యేగా గెలిచాను. అనంతరం వైఎస్సార్ హయాంలో మరోసారి నిలబడి గెలిచి మంత్రి పదవి పొందాను. వైఎస్సార్ మరణాంతరం సీఎం జగన్ కు అండగా ఉండాలని మా కుటుంబం భావించి మంత్రి పదవిని సైతం వదులుకుని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి గెలిచాను. అనంతరం సీఎం జగన్ ఆధ్వర్యంలో మళ్లీ మంత్రి పదవి పొందాను.
మంత్రి పదవి నుండి తొలగిస్తానంటే అందర్ని తొలగించేమాటైతే ఓకే అన్నాను. కానీ ఇటీవల పరిస్థితులు చూస్తే ఒకరేమో చెన్నై మార్గంలో హవాలా రూపంలో డబ్బు తరలింపు అంటారు. మరొకరేమో భూకబ్జాలు అంటారు. ఎమ్మెల్యేలతో నాపై ఫిర్యాదులు చేయిస్తారు. మీకు ఇబ్బంది అయితే నేను పట్టించుకోను. వైసీపీ కోసం ఎంత శ్రమించానో, ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు.(Balineni Srinivasa Reddy)
కానీ ప్రస్తుతం కార్యకర్తలకు న్యాయం చేస్తుంటే నాపై, నాకొడుకుపై నిందలు వేయడాన్ని భరించలేకపోతున్నా. ఎవరెవరితోనో మాట్లాడిస్తారు. మేము ఎమ్మెల్యేల దగ్గరో, ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. 1978లోనే మా తండ్రి జనతాపార్టీ నుండి పోటీ చేశారు. కార్యకర్తలు, నాయకుల కోసం ఎటువంటి త్యాగమైనా చేసేందుకు సిద్ధం.
నా వెనుక కుట్రలు చేస్తుంది ఎవరో తెలుసు. పార్టీకి కట్టుబడి ఉన్నందువల్ల ఆ కుట్రల వెనుకాల ఉన్న వ్యక్తుల పేర్లు వెల్లడింఛలేకపోతున్నా. గోనే ప్రకాశ్ మీడియా సమావేశం పెట్టి.. నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైవీ సుబ్బారెడ్డి అని, నేను భూకబ్జాలు చేశాననీ ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రాంత వ్యక్తికి ఏపీ రాజకీయాలతో పనేంటి?
నేను సీట్లు ఇప్పించిన ఎమ్మెల్యేలే నాపై సీఎం జగన్ కు ఫిర్యాదులు చేశారు. ఏమీ లేని చోట ఉన్నట్లు సృష్టించి నాపై ఫిర్యాదులు చేస్తున్నారు. మేము టీడీపీ, జనసేన నేతలతో టచ్ లో ఉన్నామని, చర్చించామని అంటున్నారు. కానీ, అందులో నిజం లేదు. మేమంటే గిట్టని వారు చేస్తున్న ప్రచారం మాత్రమే”.(Balineni Srinivasa Reddy)