Ind vs Aus 3rd ODI
Ind vs Aus : క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమ్ ఇండియా (Team India) ఆశలు నెరవేరలేదు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) తో జరిగిన మూడో వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (81; 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) దూకుడుగా ఆడగా విరాట్ కోహ్లీ(56; 61 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకంతో రాణించాడు.
శ్రేయస్ అయ్యర్ (48; 43 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు), రవీంద్ర జడేజా (35) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో కేఎల్ రాహుల్ (26), వాషింగ్టన్ సుందర్ (18), సూర్యకుమార్ యాదవ్ (8)లు విఫలం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లెన్ మాక్స్వెల్ నాలుగు వికెట్లు తీయగా, హేజిల్వుడ్ రెండు, మిచెల్ స్టార్క్, సంగా, పాట్ కమిన్స్, గ్రీన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మొదటి రెండు వన్డేల్లో గెలిచిన భారత్ 2-1తో వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది.
భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా..
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (96; 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (74; 61 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్ ), లబుషేన్ (72; 58 బంతుల్లో 9 ఫోర్లు) వార్నర్ (56; 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) లు అర్థశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
Shubman Gill : పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంకు శుభ్మన్ గిల్ టెన్షన్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు మొదటి వికెట్కు 78 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా వార్నర్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 32 బంతుల్లోనే అర్థశతకాన్ని అందుకున్నాడు. అయితే.. వార్నర్ దూకుడు ప్రసిద్ధ్ కృష్ణ అడ్డుకట్ట వేయడంతో ఆసీస్ మొదటి వికెట్ కోల్పోయింది. వార్నర్ను ఔట్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా స్కోరు వేగం తగ్గలేదు సరికదా పెరిగింది.
దూకుడుగా ఆడిన స్మిత్-మార్ష్ జోడి..
మరో ఓపెనర్ మిచెల్ మార్ష్తో వన్ డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జతకలిశాడు. వీరిద్దరు బౌండరీలు బాదుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఈ క్రమంలో మార్ష్ 45 బంతుల్లో, స్మిత్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అర్థశతకం దాటిన తరువాత మార్ష్ మరింత వేగంగా ఆడాడు. శతకానికి నాలుగు దూరంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి పెవిలియన్కు చేరుకున్నాడు. స్మిత్-మార్ష్ జోడి రెండో వికెట్ కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Harsh Goenka : టీమ్ఇండియా జెర్సీ స్పాన్సర్లకు శాపం తగులుతోందా..? బైజూస్ నుండి డ్రీమ్11 వరకు..!
ఈ దశలో భారత బౌలర్లు విజృంభి క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. క్రీజులో నిలదొక్కుకున్న స్మిత్ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తరువాత అలెక్స్ కేరీ(11), మాక్స్వెల్(5) లను బుమ్రా పెవిలియన్కు చేర్చగా, గ్రీన్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరో వైపు మార్నస్ లుబుషేన్ తనదైన శైలిలో ఆడుతూ 43 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కమిన్స్ (19 నాటౌట్) తో కలిసి లబుషేన్ ధాటిగా ఆడడంతో ఆసీస్ స్కోరు 350 దాటింది.