Hayat Nagar Police Station: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తొర్రూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఖాకీ సినిమా తరహాలో అర్థరాత్రి వేళ దోపిడీ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళ సత్యమ్మను దుండగులు హత్యచేశారు. ఆమె గొంతు నులిమి, తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. వృద్ధురాలు వద్ద ఉన్న 25తులాల బంగారంను దుండగులు అపహరించుకొని పారిపోయారు. హయత్ నగర్ శివారు ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు వృద్ధురాలు సత్యమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Odisha : మహిళలు,చిన్నారులతో సహా ఐస్క్రీం తిన్న 70 మందికి అస్వస్థత ..
సోమవారం ఉదయం సత్యమ్మ ఇంటి తలుపులు తీసి ఉండటం, ఆమె లేవకపోవటంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల ప్రజలు ఆమె ఇంటిలోకి వెళ్లి చూడగా సత్యమ్మ తలకు తీవ్ర గాయాలతో మృతి చెందింది. స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలాఉంటే దారుణ ఘటనతో మృతురాలి సత్తెమ్మ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె కుమారుడు బాల్రెడ్డి 10టీవీతో మాట్లాడారు. బంగారం కోసమే తన తల్లిని హత్య చేశారని అన్నారు. పోలీస్ అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. తన తల్లిని ఆదివారం రాత్రి పది గంటలకు ఇంట్లో వదిలేశానని, రాత్రి 11 గంటల ప్రాంతంలో అందరితో మాట్లాడిందని తెలిపారు.
ఇంట్లో ఉన్న 25 తులాల బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారని అన్నారు. సీసీ టీవీ కెమెరాలు పనిచేయకపోవడం దారుణమని బాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి ముఠాలు, డ్రగ్స్ ముఠాలు పరిసర ప్రాంతంలో ఎక్కువ అయ్యాయని, నగర శివారు ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, నిందితులను త్వరగా పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాల్ రెడ్డి కోరారు. ఇదిలాఉంటే ఖాకీ సినిమా తరహాలో దోపిడీ జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండగులు మహిళను హత్యచేసి నగలు దొంగిలించుకొని పోవటంతో ఆందోళనలో ఉన్న స్థానికులు.. శివారు ప్రాంతాల్లో పోలీస్ భద్రత కల్పించాలని కోరుతున్నారు.