CM KCR : ఓడి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రిని చేశా, ఆయనే బీఆర్ఎస్‌కు ద్రోహం చేశాడు- తుమ్మలపై సీఎం కేసీఆర్ ఫైర్

పాలేరులో ఎమ్మెల్యే చేస్తే, ఐదేళ్ళు పెత్తనం ఇస్తే, ఒక్క సీటు తప్ప, అన్ని సీట్లు ఓడిపోయారు. ఎవరికి ఎవరు మోసం చేశారో ప్రజలే ఆలోచించాలి. CM KCR

CM KCR Fires On Tummala Nageswara Rao

CM KCR Fires On Tummala Nageswara Rao : బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో ఓ మూలన కూర్చుంటే పిలిచి మరి మంత్రిని చేశాను అని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తుమ్మలకు ద్రోహం చేయలేదు.. తుమ్మలే బీఆర్ఎస్ కు ద్రోహం చేశాడు అని ఆరోపించారు కేసీఆర్.

ఎవరు ఎవరిని మోసం చేశారు?
”నా మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడపై ఓడిపోయాడు. పిలిచి మంత్రిని చేశా. పాలేరులో ఎమ్మెల్యే చేస్తే, ఐదేళ్ళు పెత్తనం ఇస్తే, ఒక్క సీటు తప్ప, అన్ని సీట్లు ఓడిపోయారు. ఎవరికి ఎవరు మోసం చేశారో ప్రజలే ఆలోచించాలి. ఇది రాజకీయమా? పాలేరు నుండి కందాళ ఉపేందర్ రెడ్డిని అసెంబ్లీ గేట్ దాటనీయండి. పాలేరుకి దళితబంధు పథకం నియోజకవర్గం అంతా ఇస్తా.

నోట్ల కట్టలతో వచ్చే వారు ఏమీ చేయరు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గిరిజనుల పట్ల చులకనగా మాట్లాడుతున్నారు. పేద మహిళలకు నెలకు 3వేలు ఇస్తా. సన్న బియ్యం ఇస్తా. కేసీఆర్ భీమా ఇస్తా. గ్యాస్ సిలెండర్ 400కే ఇస్తా. ఖమ్మంలో రెండుసార్లు ఒక్కొక్క సీటు ఇచ్చారు. ఈసారి ఎక్కువ సీట్లు ఇవ్వాలి” అని ఓటర్లను కోరారు సీఎం కేసీఆర్.

Also Read : బీఆర్ఎస్ పై గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు.. గులాబీ ముఖ్య నేతలపై హస్తం సీనియర్ నేతలు పోటీ?

ఆ ఇద్దరు నేతలు డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నారు..
పాలేరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ”ఖమ్మం జిల్లాలో ఇద్దరు నాయకులు ఉన్నారు. వారికి డబ్బు అహంకారం ఉంది. డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం, ఏదైనా చేయగలం అనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తొక్కనీయం అని అంటున్నారు.

మీ కడుపులో పేగులు లాగుతారు.. జాగ్రత్త..
ప్రజలు అనుకున్న తర్వాత అసెంబ్లీ వాకిలి ఎవరు తొక్కుతారో అందరికీ తెలుసు. మీరంతా అనుకుంటే దుమ్ము లేవదా? కాంట్రాక్టులతో డబ్బు సంపాదించి, ఆ డబ్బు మదంతో ప్రజలనే కొంటాం అంటున్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చా? కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిమ్మల్ని ఏమారుస్తారు. అదే చెయ్యి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారు. ఆ మాట మర్చిపోవద్దు. లేదంటే దెబ్బతింటారు జాగ్రత్త” అని పాలేరు ప్రజలను హెచ్చరించారు కేసీఆర్.

పిలిచి పదవి ఇస్తే ద్రోహం చేశాడు..
”నేను అన్యాయం చేశాను అని మిత్రుడు తుమ్మల అంటున్నారు. ఆయన ఖమ్మంలో ఓడిపోయాడు. ఇంటికి వెళ్లి మూలన కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నేను.. పాత స్నేహంతో, సీనియర్ నాయకుడు అని భావించి తుమ్మలను తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చా. ఎమ్మెల్సీ చేశా. ఉపఎన్నికల్లో పాలేరు టికెట్ ఇచ్చా. మేమందరం వచ్చి ప్రచారం చేస్తే మీరు గెలిపించారు. ఐదేళ్లు జిల్లా మీద నీకు ఏకచత్రాధిపత్యం ఇచ్చాం. నీకంత చేస్తే నువ్వు చేసింది ఏంటి? ద్రోహం చేశావు. ఖమ్మంలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాకుండా చేశావు.

Also Read : పెద్దపల్లి నియోజవకర్గంలో ఆ రికార్డును సాధిస్తారా?

అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే..
ఎవరు ఎవరికి మోసం చేశారు? బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? లేక తుమ్మలే బీఆర్ఎస్ కు అన్యాయం చేశాడా? న్యాయం చెప్పాల్సింది మీరే అని మనవి చేస్తున్నారు. నోరు ఉంది కదా అని బీఆర్ఎస్, కేసీఆర్ మీద అడ్డగోలుగా మాట్లాడితే.. అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు.. అది అరాచకం. ఆ అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే. అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా ప్రజలే” అని మనవి చేశారు కేసీఆర్.

ట్రెండింగ్ వార్తలు