Gold Rate: ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో దిగుమతి సుంకాలు తగ్గించడంతో భారత్లో పసిడి ధరలు తగ్గుతున్నాయి. వాటి ధర ఈ వారం మొదట్లో ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాములకు రూ.74,000కు పైగా ఉంది. అయితే ఇప్పుడు దాదాపు రూ. 67,400కి తగ్గింది. గత మార్చి నుండి ఇప్పటివరకు బంగారం ధర ఇంతగా ఎన్నడూ తగ్గలేదు.
బంగారం, వెండిపై కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని కేంద్ర సర్కారు 15 నుంచి 6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రాథమిక కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, డెవలప్మెంట్ సెస్ 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. దీంతో దేశంలో బంగారం, వెండిపై పన్నులు తగ్గనున్నాయి. సమీప భవిష్యత్తులోనూ వాటి ధరల్లో తగ్గుదల కనపడుతుంది.
చాలా కాలంగా ఉన్న డిమాండ్
ఇంతకుముందు ఉన్న 18.5 శాతం నుంచి 9 శాతానికి (జీఎస్టీతో పాటు) పన్నులు తగ్గుతాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. అయితే, కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గించడానికి కొన్ని దశాబ్దాలుగా పసిడిపై కస్టమ్స్ సుంకాలను పెంచుతోంది. ఇప్పుడు సుంకాలు తగ్గించడంతో ఇన్పుట్ ఖర్చులు తగ్గుతాయి.
అంతేగాక, దేశంలో బంగారం స్మగ్లింగ్ను తగ్గించే అవకాశాలు ఉంటాయి. దేశీయ తయారీనీ ప్రోత్సహిస్తుంది. ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉంది. ఆ డిమాండ్లో అధిక భాగం దిగుమతుల ద్వారానే బంగారం అందుతోంది.
ఇంతకుముందు అక్రమ మార్గాల ద్వారా పసిడి దిగుమతులు పెరగడంతో సర్కారుకి రెవెన్యూ విషయంలో నష్టం జరిగింది. ఇప్పుడు ఈ నష్టం తగ్గే అవకాశం ఉంది. దేశంలో బంగారం స్మగ్లింగ్ 2022లో దాదాపు 100 టన్నులుగా జరిగింది. ధరల పెరుగుదలతో గత ఏడాది 155 టన్నులకు చేరింది. ఇప్పుడు సుంకం తగ్గింపుతో దేశీయ, విదేశీ బంగారం మధ్య ధరల వ్యత్యాసం కూడా తగ్గుతుంది. స్మగ్లింగ్ తగ్గుతుంది.. ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుంది.
Also Read : జియోథింగ్స్తో మీడియాటెక్.. టూవీలర్ల కోసం 4జీ స్మార్ట్ ఆండ్రాయిడ్ క్లస్టర్ మాడ్యూల్..!