వన్డే ప్రపంచకప్ 2023 ఆఖరి దశకు చేరుకుంది. లీగ్ దశ ముగిసింది. నాకౌట్ మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదటి సెమీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. బుధవారం (నవంబర్ 15న) జరగనున్న ఈ మ్యాచ్కు వాంఖడే వేదిక కానుంది. ఇప్పటికే ముంబై చేరుకున్న భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రాక్టీస్ను మొదలెట్టేశాయి. ఈ క్రమంలో సెమీ ఫైనల్ మ్యాచ్ గురించి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మీడియాతో కేన్ మాట్లాడుతూ.. ఈ మెగాటోర్నీలో భారత జట్టు అసాధారణంగా ఆడుతోందన్నాడు. సెమీ ఫైనల్లో టీమ్ఇండియాతో తలపడడం ఓ సవాల్గానే భావిస్తున్నట్లు చెప్పాడు. మ్యాచ్ లో విజయం సాధించేందుకు తమ శాయశక్తుల ప్రయత్నం చేస్తామన్నాడు. ప్రపంచకప్ ఆరంభానికి ముందు మీడియా తమని అండర్ డాగ్స్గా పేర్కొందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.
హార్థిక్ దూరమైనా..
అండర్ డాగ్స్ గానే రేపటి మ్యాచ్లోనూ బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే.. ఇరు జట్లకు మ్యాచ్లో గెలిచేందుకు సమాన అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. భారత జట్టు అత్యుత్తమ జట్టే కావొచ్చు.. అయితే మనదైన రోజున అత్యుత్తమ క్రికెట్ ఆడితే ఎలాంటి జట్టునైనా ఓడించవచ్చునని తెలిపాడు. ఆల్రౌండర్ హార్థిక్ పాండ్య దూరం అయినప్పటికీ భారత జట్టు సమతుల్యం దెబ్బతినకుండా జాగ్రత్త పడిందన్నారు.
వాంఖడే స్టేడియం మొత్తం టీమ్ఇండియా అభిమానులతో నిండిపోయే అవకాశం ఉందని విలియమ్సన్ తెలిపాడు. ఇలా ప్రతికూల ప్రతిస్థితుల్లో ఆడిన అనుభవం తమకు ఉందని చెప్పాడు. భారీ జనసందోహం మధ్య కివీస్ ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నాడు. మొత్తంగా మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నం చేయనున్నట్లు వివరించాడు.