ఏపీని గ్లోబల్ లీడర్ చేయడమే లక్ష్యం- సీఎం చంద్రబాబు నాయుడు

మా పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించ లేదు. పదవుల కోసం డిమాండ్ చేయలేదు. వాజ్ పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్న తీసుకోలేదు.

Cm Chandrababu Naidu : ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో సరిదిద్దలేనంత నష్టం రాష్ట్రానికి జరిగిందని ఆయన వాపోయారు. ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏపీని గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే మా లక్ష్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియా చిట్ చాట్ లో పలు కీలక విషయాలు చెప్పారు.

”దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి. కృష్ణా గోదావరి నదులు రాష్ట్రం గుండా వెళ్తున్నాయి. ఒక్క గోదావరి నది నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రం పాలు అవుతుంది. ఆ నీటిని వినియోగించుకుంటే దక్షిణాది మొత్తానికి నీటిని ఇవ్వొచ్చు. మా పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించ లేదు. పదవుల కోసం డిమాండ్ చేయలేదు. వాజ్ పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్న తీసుకోలేదు. ఒక్క స్పీకర్ పోస్టు మాత్రమే తీసుకున్నాం. మేము డిప్యూటీ స్పీకర్ పదవి అడగలేదు. బీజేపీ అధిష్టానం కూడా ఇస్తామనలేదు. మాకిచ్చిన మంత్రి పదవుల పట్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం.

గత ఐదేళ్లలో జగన్ పాలన వల్ల అమరావతి ప్రాముఖ్యత తగ్గింది. అమరావతికి తిరిగి ప్రాముఖ్యత తీసుకొచ్చేలా పని చేస్తాం. ఐదేళ్లలో ప్రభుత్వపరంగా కావాల్సిన మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేస్తాం. దశల వారిగా నిర్మాణాలు పూర్తి చేస్తాం. వచ్చే ఐదేళ్లలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో నైపుణ్య గణన చేపడతాం. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లభించింది.

ఏపీలో మానవ వనరులను మూల ధన వనరులుగా మార్చి సంపద సృష్టిస్తాం. అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యలు పరిష్కరించుకోవలనేది మా లక్ష్యం. ఏపీలో డెవిల్ ను కంట్రోల్ చేసాం. ఏపీలో పెట్టుబడులకు ఇబ్బంది లేదు. ఈ ఏడాది దావోస్ కి వెళ్తా, ఏపీకి పెట్టుబడులు తెస్తా” అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read : చంద్రబాబు లెక్క మారిందా? ఈసారి అనుకున్నది సాధిస్తారా?

ట్రెండింగ్ వార్తలు