టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచకప్ సాధించడంతో ఆటగాళ్లతో పాటు యావత్ భారత్ సంబరాల్లో మునిగిపోయింది. ప్రపంచకప్ను సొంతం చేసుకున్న నాలుగు రోజుల తరువాత ఆటగాళ్లు స్వదేశంలో అడుగుపెట్టారు. గురువారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.
ఎయిర్ పోర్టు నుంచి హోటల్కు వెళ్లిన ఆటగాళ్లు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు అరగంట పాటు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మోదీతో మాట్లాడారు. మోదీతో భేటీ అనంతరం భారత జట్టు ప్రత్యేక విమానంలో ముంబైకి వచ్చింది. సాయంత్రం 5 గంటల సమయంలో ముంబై వీధుల్లో ఓపెన్ టాప్ బస్సులో ట్రోఫీతో ఆటగాళ్లు ఫ్యాన్స్కు అభివాదం చేయనున్నారు.
Rishabh Pant : చాలు చాలు లే.. మా దగ్గర ఉంది లేవోయ్.. పంత్ను ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్..
ఆ తరువాత రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆటగాళ్లకు సన్మానం చేయనుంది. ఈ కార్యక్రమానికి టీమ్ఇండియా మాజీ, దిగ్గజ ఆటగాళ్లతో పాటు బీసీసీఐ పెద్దలు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకను చూసేందుకు అభిమానులకు అనుమతి ఇచ్చింది. అది కూడా ఉచితంగా. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ముంబై క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ క్రమంలో స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
వెంటాడుతున్న వరుణుడు..
ఇక భారత జట్టును వరుణుడు వెంటాడుతూ ఉన్నారు. టీ20 ప్రపంచకప్లో వర్షం కారణంగా కెనడాతో భారత్ మ్యాచ్ రద్దైంది. ప్రపంచకప్ విజయం సాధించిన ఆనందంలో స్వదేశానికి రావాలనుకున్న సమయంలో బార్బడోస్లో తుఫాన్ కారణంగా విమానాశ్రం మూసివేశారు. దీంతో నాలుగు రోజుల ఆలస్యం టీమ్ఇండియా స్వదేశానికి వచ్చింది. ఇక ఇప్పుడు సన్మాన కార్యక్రమంలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. రాత్రి ఏడు గంటల సమయంలో దాదాపు 90 శాతం వాంఖడే స్టేడియంలో పరిసరాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
𝘎𝘦𝘵 𝘳𝘦𝘢𝘥𝘺 𝘵𝘰 𝘸𝘦𝘭𝘤𝘰𝘮𝘦 𝘰𝘶𝘳 𝘊𝘏𝘈𝘔𝘗𝘐𝘖𝘕𝘚 🥳🏆#MCA #Mumbai #Cricket #Wankhede #BCCI pic.twitter.com/InVPvEnbNn
— Mumbai Cricket Association (MCA) (@MumbaiCricAssoc) July 4, 2024