17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి పొట్టి ప్రపంచకప్ను ముద్దాడింది టీమ్ఇండియా. ప్రపంచకప్ గెలిచి భారత ఆటగాళ్లు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. వారికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
ఢిల్లీలో నరేంద్ర మోదీతో భేటీ తరువాత ముంబైకి వచ్చిన భారత ఆటగాళ్లకు తమ జీవితంలో మరిచిపోలేని అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఫ్యాన్స్తో ముంబై తీరం మొత్తం జనసంద్రంగా మారింది. క్రికెటర్లపై అభిమానులు పూల వర్షం కురిపించారు. నినాదాలతో హోరెత్తించారు. విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. అక్కడా స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించింది. ముందుగా చెప్పినట్లుగా రోహిత్ సేనకు రూ.125 కోట్ల భారీ నజరాను అందించింది.
Rishabh Pant : చాలు చాలు లే.. మా దగ్గర ఉంది లేవోయ్.. పంత్ను ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్..
నేడు హైదరాబాద్లో..
ఇక టీమ్ఇండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్. ఈ రోజు (జూలై 5 శుక్రవారం) భాగ్యనగరానికి చేరుకోనున్నాడు. ఈ క్రమంలో అతడికి ఘన స్వాగతం చెప్పేందుకు అభిమానులు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో భారీ రోడ్ షోను నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు రోడ్ షో ప్రారంభం కానుంది. మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది. ఈ విషయాన్ని సిరాజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీని హైదరాబాద్లో రీక్రియేట్ చేస్తున్నాం అంటూ రాసుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్లో సిరాజ్ అమెరికాలో జరిగిన గ్రూప్ స్టేజీలోని మ్యాచుల వరకే తుది జట్టులో కొనసాగాడు. ఆ తరువాత అతడికి అవకాశం రాలేదు. విండీస్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండడంతో మనోడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. కాగా.. గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.