Vijayasai Reddy – Chandrababu Remand : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఊహించని షాక్ తగిలింది. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి రిమాండ్ విధించింది. ఈ నెల 22వ తేదీవరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు ఆదివారం (సెప్టెంబర్ 10) రాత్రి 7గంటల ప్రాంతంలో తీర్పు చదివి వినిపించారు. చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు షాక్ తిన్నాయి. తీవ్రంగా నిరుత్సాహాపడ్డాయి. అటు వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
స్కిల్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్ పై వైసీపీ ఎంపీ, రీజనల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు నేరం చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. ఇన్నాళ్లూ చట్టం నుంచి తప్పించుకున్న చంద్రబాబు ఈసారి మాత్రం దొరికిపోయారని అన్నారు. ఈ కేసులో చంద్రబాబుకి పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. ఇక జీవితాంతం చంద్రబాబు జైల్లో ఉండాల్సిందే అని చెప్పారు.
Also Read..Chandrababu Remand: ఈ నెల 22 వరకు చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్.. బెయిల్ పిటిషన్ దాఖలు
” చంద్రబాబు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో ఒక ధృడమైన అభిప్రాయానికి వచ్చారు. ఎన్ని అన్యాయాలు, ఎన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఎంత అధికార దుర్వినియోగం చేసినా చట్టాల నుండి తప్పించుకోవచ్చు. స్టే తెచ్చుకుని తప్పించుకోవచ్చు అనే భావనలో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నేటికి కూడా చట్టానికి లోబడి పని చేయాల్సి ఉంటుందని కోర్టు ద్వారా నిరూపితమైంది.
పక్కా ఆధారాలతో చంద్రబాబుపై సీఐడీ కేసు పెట్టింది. ఇదే కాదు చంద్రబాబుపై మరో 6, 7 ప్రాసిక్యూషనల్ కేసులు ఉన్నాయి. చట్టాన్ని తన చేతుల్లో ఉన్న ఆయుధంగా మలుచుకుని స్వార్ధంతో తప్పించుకుంటూ వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు ట్రెజరీనీ దోచుకుని ఆ సొమ్ముని విదేశాలకు తరలించారు. ఆ సొమ్మును రాబట్టేందుకు సీఎం జగన్ పని చేస్తున్నారు.
ఈ కేసులో చంద్రబాబుకు పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. పూర్తిగా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిమాండ్ లో ఇంకా అనేక నిజాలు బయటపడతాయి. చంద్రబాబే కాదు రామోజీరావు కూడా దారుణ నేరాలకు పాల్పడ్డారు. వారందరిని చట్ట పరిధిలోకి తెచ్చి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని ధర్మాన్ని నెరవేరుస్తాం. ప్రజాధనాన్ని దోచుకుని నేరానికి పాల్పడ్డ వ్యక్తిపై కేసులు పెడితే కక్షసాధింపు ఎలా అవుతుంది? అలా కక్ష ఉండి ఉంటే ఈరోజు కోర్టు రిమాండ్ విధించేది కాదు. కోర్టు రిమాండ్ తో పాటు పోలీసుల రిమాండ్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అది కోర్టు పరిధిలోకి వెళ్తుంది. కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సి ఉంటుంది” అని విజయసాయిరెడ్డి అన్నారు.