Kurnool Lok Sabha Constituency : వచ్చే ఎన్నికల్లో కొండారెడ్డి బురుజుపై జెండా పాతేది ఎవరు….ఆసక్తి కరంగా కర్నూలు రాజకీయాలు

ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్. మంత్రి గుమ్మనూరుకు పోటీగా చిప్పగిరి జడ్పీటీసీ బుసినే విరుపాక్షిని ఆయన వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది.

Kurnool Lok Sabha Constituency : తెలుగు రాజకీయానికి నాయకత్వం చూపిన నేల.. రాజకీయానికి సిసలైన అర్థాన్ని పరిచయం చేసిన నేల.. ఉద్ధండులైన అనేకమందిని నాయకులుగా మార్చిన నేల.. అదే సీమ ముఖద్వారం కర్నూలు. ఇక్కడి రాజకీయం అంటే ఎప్పటికీ ప్రత్యేకమే ! కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు.. లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీలను క్లీన్‌స్వీప్‌ చేసిన వైసీపీ.. ఈసారి సీన్ రిపీట్ చేయాలని ప్లాన్‌ చేస్తుంటే.. కొండారెడ్డి బురుజుపై జెండా పాతాలని టీడీపీ ఫిక్స్ అయింది. దీంతో ఏడాదిన్నర ముందే రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ కర్నూలు పొలిటికల్ పిక్చర్ ఏం చెప్తోంది. వైసీపీని వెంటాడుతున్న టెన్షన్ ఏంటి.. బలాలను అందుకోవడంలో టీడీపీ విఫలం అవుతోందా.. బీజేపీ, జనసేనకు అసలు అభ్యర్థులే కరవవుతున్నారా… 2024 బరిలో నిలిచే రేసుగుర్రాలు ఎవరు..

kotla vijayabhaskar, sujathamma, suryaprakash

కోట్ల, కేఈ కుటుంబానికి పెట్టని కోట…కర్నూలు రాజకీయంలో కొత్త మలుపులు

ఎంతోమంది రాజకీయ ఉద్ధండులను అందించిన కర్నూలు పార్లమెంట్‌లో రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. 1953లో ఏర్పడిన కర్నూల్‌ పార్లమెంట్.. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్‌. వైసీపీ పెట్టని కోటలా మారింది కర్నూల్‌ లోక్‌సభ స్థానం. 2014, 2019లో వరుసగా విజయం సాధించిన వైసీపీ.. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉంటే.. ఈసారి గెలిచి కొండారెడ్డి బురుజుపై గెలుపు జెండా ఎగురవేయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. కర్నూలు పార్లమెంట్‌లో ఎక్కువసార్లు కాంగ్రెస్ విజయం సాధించగా.. టీడీపీ రెండుసార్లు, వైసీపీ రెండుసార్లు గెలిచాయ్‌. కర్నూలు పార్లమెంట్ నుంచి ఎన్నికైన వారు ఎన్నో ఉన్నత పదవులను పొందారు. కోట్ల, కేఈ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కర్నూలు పార్లమెంట్‌లో రెండు కుటుంబాలకు చెందిన వారు ఎంపీగా గెలుపొందారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కూడా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

jayaram, sanjeevkumar

కర్నూలు సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్‌ అసెంబ్లీ బరిలో… వైసీపీ ఎంపి అభ్యర్ధిగా గుమ్మనూరు జయరాంను బరిలోకి దింపే ఆలోచన
వైసీపీ ఆవిర్భావం తర్వాత.. ఫ్యాన్‌పార్టీకి కర్నూలు వైసీపీ పెట్టని కోటగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కర్నూలులో ప్రస్తుతం సంజీవ్‌ కుమార్ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. ఇక్కడ మళ్లీ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ పట్టుదలతో ఉంది. ఐతే ఆయన ఈసారి ఎంపీగా కాకుండా.. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. అధిష్టానానికి విన్నపాలు కూడా వినిపిస్తున్నారని టాక్‌. తన సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మిగనూరులో మెజారిటీ ఓటర్లుగా ఉన్నారు. అధిష్టానం కూడా సంజీవ్‌ కుమార్‌కు ఎమ్మిగనూరు నుంచి చాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాంను… పార్లమెంట్ బరిలోకి దించాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే ఇదే సామాజికవర్గానికి చెందిన కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Byreddy Rajasekhar, suryaprakash

టీడీపీ నుంచి ఎంపీ బరిలో కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, వికేంద్రీకరణ పేరుతో వైసీపీ వ్యూహాలు

టీడీపీ నుంచి జిల్లాలో మంచి పట్టు ఉన్న మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పార్లమెంట్ రేసులో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కేఈ కుటుంబసభ్యులతో పాటు పలువురు బీసీ నేతలు కూడా టీడీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి బైరెడ్డి శబరి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్లు రేసులో వినిపిస్తున్నాయ్. ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం కర్నూలు చుట్టే నడుస్తోంది. వికేంద్రీకరణ వైపే తాము అంటూ ఓ వైపు వైసీపీ రాజకీయాల వ్యూహాలకు పదును పెడుతుంటే.. అమరావతే రాజధాని అంటోంది టీడీపీ. కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో వైసీపీ సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. ఐతే అసెంబ్లీ పరిధిలో వైసీపీలో కనిపిస్తున్న అంతర్గత కలహాలను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. దీంతో 2024 ఎన్నికల ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

READ ALSO : Jana Sena Avirbhava Sabha : మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ.. తొలిసారి వారాహి వాహనంలో రానున్న పవన్ కల్యాణ్

కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో కర్నూలుతో పాటు పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ఇందులో కొడుమూరు ఎస్సీ రిజర్వ్‌డ్‌ కాగా.. మిగతా నియోజకవర్గాలన్నీ జనరల్‌. ఏడు స్థానాల్లోనూ వైసీపీ హవానే కొనసాగుతోంది.

Byreddy Rajasekhar, suryaprakash

కర్నూలు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా అబ్దుల్ హఫీజ్ ఖాన్‌…టికెట్ కోసం ఎస్వీ మోహన్ రెడ్డి ప్రయత్నాలు

కర్నూలు అసెంబ్లీలో వైసీపీ సూపర్‌స్ట్రాంగ్‌గా ఉంది. అబ్దుల్ హఫీజ్ ఖాన్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వర్గవిభేదాలు ఇక్కడ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయ్‌. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్‌ తనకే అని హఫీజ్‌ ఖాన్‌ ధీమాగా కనిపిస్తుంటే.. ఎస్వీ మోహన్ రెడ్డి కూడా టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇద్దరు నేతలు గడపగడపకు కార్యక్రమంలో పోటాపోటీగా పాల్గొంటున్నారు. ఇద్దరు నేతల తీరుతో పార్టీ కేడర్‌లో అయోమయం కనిపిస్తోంది. ఎస్వీ మోహన్ రెడ్డి వర్గం విధానాలను ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఐతే ఇద్దరి మధ్య వర్గపోరును క్యాష్‌ చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇక్కడ సైకిల్ పార్టీ నుంచి టీజీ భరత్ బరిలో దిగబోతున్నారు. నగరంలో టీజీ కుటుంబానికి మంచి బ్రాండ్ ఉంది. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇదేమి కర్మ కార్యక్రమంలో భరత్ ఉత్సాహంగా పాల్గొంటూ జనాల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.

Sudhakar, suryaprakash,harshavardhan, ramanjaneyulu

READ ALSO : Chittoor Lok Sabha Constituency : చిత్తూరులో ఫ్యాన్ పార్టీ పట్టునిలుపుకుంటుందా?..అధికార పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహాలేంటి?

కోడుమూరులో వైసీపీని ఇబ్బందిపెడుతున్న ఆధిపత్య పోరు…టిడిపి టికెట్ రేసులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి

కోడుమూరులో సుధాకర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఆధిపత్య పోరు ఇక్కడ వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే సుధాకర్‌‌, నియోజకవర్గ ఇంచార్జి, కుడా చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య యుద్ధం పీక్స్‌కు చేరింది. ఇరువర్గాలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయ్. ఇద్దరు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో ఈసారి టికెట్ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోదరుడు సతీష్‌కు ఇచ్చే ఆలోచనల్లో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు మణిగాంధీ, మురళీ కృష్ణ కూడా కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఐతే టికెట్ తనకే ఖాయం అని ఎమ్మెల్యే సుధాకర్‌ ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ ఐఏఎస్ రామాంజనేయులు.. ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బలమైన అభ్యర్థి లేకపోవడంతో.. ఇక్కడ టీడీపీ కేడర్‌ తీవ్ర అసంతృప్తిలో కనిపిస్తోంది. ఈసారి టీడీపీ టికెట్ సాధించాలని.. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయ్.

chennakesava reddy, jayanageswar

ఎమ్మిగనూరు లో మళ్లీ పోటీ చేయడం లేదని ప్రకటించిన చెన్నకేశవరెడ్డి…

ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్‌ వర్గానికి.. ఎమ్మెల్యే వర్గానికి మధ్య అంతర్గ విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయ్. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. ఈ మధ్యే చెన్నకేశవరెడ్డి ప్రకటించారు. దీంతో టికెట్ కోసం వైసీపీలో నేతలు పోటీపడుతున్నారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌, మాజీ ఎంపి బుట్టా రేణుకాతో పాటు.. మంత్రాలయం ఎమ్మెల్యే తనయుడు ధరణిరెడ్డి, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, రుద్రగౌడ్ టికెట్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. చేనేత, కర్ని సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ విజయాన్ని డిసైడ్ చేయగలరు. దీంతో కర్ని సామాజికవర్గానికి చెందిన ఎంపీ సంజీవ కుమార్, బుట్టా రేణుకలో ఒకరికి టికెట్ ఇస్తే విక్టరీ ఈజీ అవుతుందనే చర్చ జరుగుతోంది. ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. 2004వరకు ఇక్కడ టీడీపీ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున జయనాగేశ్వర రెడ్డి పోటీ చేశారు. ఐతే వర్గవిభేదాలు సైకిల్‌ పార్టీకి ఇక్కడం ఇబ్బందిగా మారాయ్‌. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున జయనాగేశ్వరరెడ్డి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుండగా.. ఆయనకు టికెట్ రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ నడుస్తోంది. కోట్ల వర్గానికి చెందిన గోనేగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి కూడా టీడీపీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ, జనసేన నుంచి ఇక్కడ పోటీ చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

READ ALSO : Jana Sena Avirbhava Sabha : మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ.. తొలిసారి వారాహి వాహనంలో రానున్న పవన్ కల్యాణ్

jayaram, sujathamma, nirajareddy

ఆలూరులో అధికార పార్టీ, ప్రతిపక్ష టిడిపిలో వర్గ పోరు….ఎంపీ బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు

ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్. మంత్రి గుమ్మనూరుకు పోటీగా చిప్పగిరి జడ్పీటీసీ బుసినే విరుపాక్షిని ఆయన వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. ఐతే ఈసారి మంత్రి గుమ్మనూరును.. కర్నూలు ఎంపీ బరిలో దింపేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్‌ చేస్తోందని.. అదే జరిగితే ఆయన కుటుంబం నుంచే ఒకరికి ఆలూరు నుంచి అవకాశం ఇచ్చే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆలూరు టీడీపీలో ఇప్పటికే టికెట్ల లొల్లి మొదలైంది. పార్టీ ఇంచార్జిగా ఉన్న కోట్ల సుజాతమ్మతో పాటు.. వైకుంఠ మల్లికార్జున, వీరభద్రగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు అధిష్టానం మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆలూరులో టీడీపీ మూడు వర్గాలు విడిపోయినట్లు కనిపిస్తోంది. ఇది పార్టీకి నష్టం కలుగజేసే అవకాశం ఉందని.. తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ కనిపిస్తోంది. టీడీపీ వర్గపోరు వైసీపీకి కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Sridevi, syambabu

పత్తికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు టీడీపికి కలిసొచ్చేనా…

పత్తికొండలో కంగాటి శ్రీదేవి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైసీపీకి వర్గపోరు ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు వినిపిస్తుండగా.. ఈ విషయాన్ని ప్రత్యర్థి వర్గం నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తోంది. ఇక్కడ శ్రీదేవితో పాటు కేడీసీసీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, పోచమిరెడ్డి మురళీధర్ రెడ్డి కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా పత్తికొండ సీటు ఇస్తే.. పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్‌బాబు ఈసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలో కురువ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు కూడా పత్తికొండ నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు.

READ ALSO : Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

meenakshi naidu, saiprasad

ఆదోనిలో టీడీపీ, వైసీపీకి దీటుగా విస్తరిస్తున్న జనసేన పార్టీ…ముస్లీంలకు టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఆలోచన

ఆదోనిలో సాయిప్రసాద్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్‌ మీద కన్నేశారు. సాయిప్రసాద్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న అవినీతి ఇక్కడ వైసీపీకి ఇబ్బందిగా మారే చాన్స్ ఉంది. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, రిజిస్ట్రేషన్‌లో కమీషన్ వంటి ఆరోపణలతో.. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసిన గెలుపు కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఐతే సాయిప్రసాద్ రెడ్డి ఈసారి తన తనయుడు మనోజ్ రెడ్డిని బరిలో దింపాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మనోజ్‌రెడ్డికి టికెట్‌ కోసం అధిష్టానంపై ఆయన ఒత్తిడి కూడా పెంచుతున్నారనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుతో పాటు.. నియోజకవర్గ మాజీ ఇంచార్జి గుడిసె కిష్టమ్మ కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఐతే ముస్లీంలకు ఈసారి అవకాశం ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం భావిస్తుందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ, వైసీపీకి దీటుగా ఆదోనిలో జనసేన చాపకింద నీరులా విస్తరిస్తోంది. జనసేన తరఫున మల్లయ్య బరిలో దిగేందుకు సిద్ధం అయ్యారు.

meenakshi naidu, saiprasad

మంత్రాలయంలో మరోమారు బరిలోకి బాలనాగిరెడ్డి…. టీడీపీ తరఫున తిక్కారెడ్డికి మళ్లీ అవకాశం

మంత్రాలయంలో బాలనాగిరెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 నుంచి వరుసగా ఆయనే విజయం సాధిస్తూ వస్తున్నారు. మళ్లీ వైసీపీ తరఫున ఆయనే ఈసారి కూడా బరిలోకి దిగడం ఖాయం. ఐతే బాలనాగిరెడ్డి అన్నకొడుకు ప్రదీప్ రెడ్డిని ఈసారి మంత్రాలయం బరిలో దించాలని ఆ కుటుంబం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రాలయంలో ఎలాగైనా జెండా పాతాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. నియోజకవర్గం ఇంచార్జి తిక్కారెడ్డి.. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈసారి మళ్లీ ఆయనకే టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఎన్నికలకు ఏడాదిన్నర ఉన్నా.. ఇప్పటినుంచే తిక్కారెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. జనాలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో.. అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయ్. దీంతో కేడర్‌లో అయోమయం కనిపిస్తోంది. అంతర్గత విభేదాలను చక్కబెట్టేందుకు అధిష్టానం దూతలను పంపినా.. ఫలితం కనిపించడం లేదు. వైసీపీలో ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఐతే అనుకున్న స్థాయిలో దాన్ని అందుకోవడంలో సైకిల్ పార్టీ విఫలం అవుతుందనే చర్చ జరుగుతోంది. వైసీపీతో కంపేర్‌ చేస్తే టీడీపీలో వర్గపోరు తక్కువగానే ఉన్నా.. అది కూడా పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య కర్నూలు పార్లమెంట్‌ ఫైట్ ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

 

ట్రెండింగ్ వార్తలు