TTD New Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు సీఎం జగన్ ఆయనను ఎంపిక చేశారు. ఇప్పటివరకు టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త ఛైర్మన్ గా భూమన వచ్చారు. కాగా, టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడం భూమనకు ఇది రెండోసారి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 2006 నుంచి 2008 మధ్య ఆయన ఛైర్మన్ గా పని చేశారు.
ఇకపై వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు భూమన. ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 8న ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేశారు సీఎం జగన్.
టీటీడీ ఛైర్మన్ రేసులో మొదటి నుంచి కూడా భూమన కరుణాకర రెడ్డి పేరుంది. వారం రోజుల క్రితం భూమన సీఎం జగన్ ను కలిశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీ ఛైర్మన్ గా భూమన పని చేశారు. ఆ తర్వాత మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ ను భూమన కోరుతూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గత నాలుగేళ్లుగా టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డితోనే కొనసాగించారు సీఎం జగన్. తొలుత రెండేళ్ల టర్మ్ పూర్తయిన తర్వాత.. వైవీ సుబ్బారెడ్డి పదవీకాలాన్ని మరోసారి పొడిగించారు జగన్.
ఆ పదవిని రెన్యువల్ చేసే సమయంలోనూ భూమన పేరు వినిపించింది. తనకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని భూమన కోరినా.. కొన్ని కారణాలతో జగన్ ఇవ్వలేకపోయారు. అయితే, మంత్రివర్గంలో భూమనకు చోటు దక్కుతుందని భావించారు. కానీ, దక్కలేదు. దాంతో టీటీడీ పదవిని భూమనకు ఇచ్చారు సీఎం జగన్. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను అని, తన కుమారుడు పోటీ చేస్తాడని ఇప్పటికే భూమన ప్రకటించారు. ఈ నేపథ్యంలో తనకు టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని వారం రోజుల క్రితం సీఎం జగన్ ను కలిసి అడిగారు.
Also Read..AP Volunteers: వలంటీర్ల వేతనాల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?