GOLD Stock In Bharath : 2023 ప్రారంభం నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పరుగులు పెడుతోంది పసిడి. డాలర్తో పోల్చితే 10 శాతం లాభపడింది బంగారం. మరోవైపు రష్యా-యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, చైనా-తైవాన్ మధ్య ఉద్రికత్తలు.. ఎప్పుడైనా యుద్ధం మొదలవ్వచ్చనే డ్రాగన్ హెచ్చరికలు, క్షిపణి ప్రయోగాలతో ఉత్తరకొరియా దుందుడుకు నిర్ణయాలు, ఇజ్రాయెల్ చుట్టూ అశాంతి ఇలా ఒకటేమిటి అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం వల్ల విదేశీ మారక నిల్వలకు బదులుగా బంగారం నిల్వలను పెంచుకోవాలని నిర్ణయానికొచ్చింది ఆర్బీఐ.
గత ఆర్థిక సంవత్సరంలో డాలర్తో పోల్చితే 10శాతం లాభపడిన గోల్డ్ ఈటీఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా మదుపర్ల ఆలోచనను మార్చేసింది. ఈ లిస్టులో ప్రభుత్వాలు, ప్రభుత్వ బ్యాంకులు చేరడంతో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరిలో బంగారం పెరుగుదల తర్వాత ఈ జోరు మరింత ఎక్కువైంది. మార్చిలో అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ -SVB దివాళాతో మార్కెట్ అస్థిరతకు కారణమైంది. ప్రస్తుత కఠినమైన ఆర్థిక పరిస్థితులు మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉండటంతో రాబోయే నెలల్లో కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయొచ్చు. అందుకే విదేశీ మారక నిల్వలు కన్నా.. ఆ స్థానంలో బంగారం నిల్వలు పెంచుకోవడమే బెటర్ అని బలమైన ఆర్థిక వ్యవస్థలు భావిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ ముందు వరుసలో ఉందని చెబుతున్నారు నిపుణులు.
GOLD RBI : ఆర్బీఐలో 800 టన్నుల గోల్డ్ స్టాక్.. మూడు నెలల్లో 10 టన్నుల బంగారం కొనుగోలు
కోవిడ్ మహమ్మారి విజృంభణ ఆ వెంటనే రష్యా-యుక్రెయిన్ వార్.. వీటికి కొనసాగింపుగా మరికొన్ని దేశాల్లో ఉద్రికత్తల వల్ల బంగారు నిల్వలు పెంచుకోవడానికి చాలా దేశాలు పోటీపడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోని ఉన్న సెంట్రల్ బ్యాంకులు అన్నీ తమ వాస్తవ అవసరాలకన్నా రెండున్నర రెట్లు అధికంగా బంగారాన్ని తీసుకున్నాయి. ఈ లిస్టులో భారత్ది అగ్రస్థానమని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. గత 55 సంవత్సరాల్లో ఎంత బంగారం పోగేశారో.. 2021 తర్వాత అంతకు మించిన బంగారం నిల్వలు పెంచుకోవాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ గోల్డ్ రేస్లో మన దేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అమెరికాకు 8 వేల 134 టన్నుల బంగారం నిల్వ ఉంటే.. జర్మనీకి 3 వేల 3 వందల 55 టన్నుల బంగారం ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి-IMF వద్ద 2 వేల 8 వందల 14 టన్నుల బంగారం ఉంటే.. ఇటలీలో 2 వేల 4 వందల 52 టన్నుల బంగారం.. ఫ్రాన్స్కి 2 వేల 437 టన్నుల బంగారం ఉంది. ఆర్బీఐ మాత్రం 800 టన్నుల బంగారం నిల్వ చేసింది.
బంగారం నిల్వలపై ఆర్బీఐ అమలు చేస్తున్న విధానం వల్ల వచ్చే పదేళ్లలో ప్రపంచ రిజర్వు కరెన్సీగా రూపాయి అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు ఆర్థిక వేత్తలు. బంగారపు నిల్వలు బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుందని వివరిస్తున్నారు. ఈ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలిగిస్తాయని అంటున్నారు. బంగారాన్ని నమ్ముకోవడం వల్ల నష్టపోమనే సాధారణ జనం సెంటిమెంట్నే రిజర్వు బ్యాంకు అమలు చేయడం విశేషంగా చెబుతున్నారు. బంగారంపై భారత్కు మోజు ఎక్కువైనా ఇంతవరకు ప్రభుత్వ పరంగా బంగారం సేకరణలో మన దేశం ఆచితూచి వ్యవహరించేంది. మన దేశ ఆర్థిక పరిస్థితుల వల్ల బంగారం నిల్వ కన్నా.. ఇతర అవసరాలపైనే దృష్టిపెట్టేది. కానీ, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల ఆర్బీఐ ఆలోచన విధానంలో మార్పు చోటుచేసుకుంటోందని అంటున్నారు. గత ఐదేళ్లలో ఆర్బీఐ అనుసరించిన విధానం వల్ల టన్నుల కొద్దీ బంగారం మన భాండాగారంలో నిల్వ చేసినట్లైంది. ఇక ముందు ఇదే విధానం కొనసాగిస్తే గోల్డ్ రేస్లో మన దేశం మరింత స్పీడుగా దూసుకుపోవచ్చు.