Singhu Border Killing నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న ఢిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో నిందితుడైన నిహాంగ్ సిక్కు సభ్యుడు సరవ్జీత్ సింగ్ను శనివారం సోనిపట్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
శుక్రవారం సాయంత్రం సరవ్జీత్ సింగ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. దాంతో కోర్టు నిందితుడిని ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. మరోవైపు, సింఘు బోర్డర్ హత్య కేసుకి సంబంధించి ఇవాళ మరో నిందితుడు నారాయన్ సింగ్ ను పంజాబ్ లోని ఆయన గ్రామం అమర్ కోట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య తర్వాత నారాయన్ సింగ్ తన గ్రామానికి వెళ్లాడని పోలీసులు తెలిపారు.
సింఘు హత్య ఏంటీ
శుక్రవారం తెల్లవారుజామున సింఘు బోర్డర్లో రైతులు ఆందోళన చేస్తున్న స్థలానికి సమీపంలో పంజాబ్ లోని తార్న్ తరణ్ జిల్లాలోని చీమా ఖుర్ద్ గ్రామానికి చెందిన లాఖ్బీర్సింగ్(35) అనే వ్యక్తి మృతదేహం దారుణమైన స్థితిలో కనిపించింది. చేతులు, కాళ్లు నరికిన అతడి మృతదేహం బారికేడ్లకు వేలాడుతూ కనిపించింది.
సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేశాడన్న ఆరోపణలతోనే లాఖ్బీర్సింగ్ ను నిహాంగ్ కమ్యూనిటీ సభ్యులు దారుణంగా హత్య చేసింది. ఈ హత్య కేసులో నిహాంగ్ గ్రూప్ సభ్యుడు సరబ్జిత్ సింగ్ అలియాస్ నిహాంగ్ సిఖ్ శుక్రవారం హర్యానా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసినందుకే అతడిని శిక్షించానంటూ మీడియా ముందుకు వచ్చిన అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.
ALSO READ దారుణం… బర్త్డే పార్టీకి పిలిచి మహిళా డాక్టర్పై అత్యాచారం