TSRTC: సంక్రాంతికి ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. రద్దీ ప్రాంతాలైన ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కేపీహెచ్బీలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరుతో పాటు మొబైల్ బయో టాయిలెట్లను ఏర్పాటు చేశామని వివరించారు.
ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రద్దీ ప్రాంతాల్లోని పరిస్థితిని బస్ భవన్, ఎంజీబీఎస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ 4,233 బస్సులను ఏర్పాటు చేసిందని ఎండీ వీసీ సజ్జనర్ గుర్తుచేశారు. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, ముందుస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు తిరుగు ప్రయాణంపై 10 రాయితీని కల్పిస్తున్నామని తెలిపారు.
Pakistan: ఆర్థిక సంక్షోభంపై తీవ్ర ఆగ్రహానికి లోనైన పాక్ ప్రజలు.. హోంమంత్రిపై చెప్పుతో దాడి
వీలైనంత త్వరగా సొంతూళ్లకు ప్రజలు వెళ్లేందుకు టోల్ ప్లాజాల వద్ద టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ సంక్రాంతికి సురక్షితమైన ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. ప్రైవేట్ వాహనాల్లో అధిక ధరలు చెల్లించి ప్రయాణం చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ మార్గాల్లో వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబుబ్నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్, హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు కేపీహెచ్బీ/బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయని తెలిపారు. ఈ నెల 14 వరకు ఆయా ప్రాంతాల నుంచి బస్సులు వెళ్తాయని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ చెప్పారు.