Engineering graduates selling Ganja : ఓ అమ్మాయి ఓ అబ్బాయి. ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇద్దరిదీ ఒక్కటే బ్యాచ్. దీంతో ఇద్దరూ కలిసి మెలిసి తిరిగేవారు. ఈక్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరంటే మరొకరికి చాలా చాలా ఇష్టం. ప్రేమలో ఉండగానే ఇద్దరికి ఇంజనీరింగ్ పూర్తి అయ్యింది. చేతికి పట్టా వచ్చింది. అలా చదువుకున్న వారు ఎవరన్నా అయితే.. ఉన్నత చదువులో లేక ఉద్యోగం చూసుకోవటమో చేస్తారు. కానీ వీరిద్దరూ మాత్రం గంజాయి దందాకు తెరలేపారు. చదువు పూర్తి అయ్యాక ప్రియుడి ఒత్తిడితో ప్రియురాలు గంజాయి అమ్ముతూ బెంగళూరు పోలీసులకు చిక్కింది.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 25 అమ్మాయి రేణుక. చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది. కడప జిల్లావాసి సిద్ధార్థ్ కూడా రేణుకతోపాటే అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇద్దరూ ఒకే బ్యాచ్ కావటంతో కాలేజీలోనే ప్రేమలో పడ్డారు. చదువు పూర్తి అయ్యాక రేణుక చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావటంతో వెంటనే చేరిపోయింది. కానీ సిద్ధార్థకు మాత్రం జాబ్ రాలేదు. జల్సాగా ఉండాలని సిద్ధార్థ ఆలోచన. కానీ జాబులేదు. ఈక్రమంలో చిల్లర తిరుగుళ్లకు అలవాటుపడిన అతనికి డ్రగ్స్ ముఠాలతో పరిచయం అయ్యింది. కానీ ఆ విషయం రేణుకకు చెప్పకుండా నేను ఓ వ్యాపారాన్ని ప్రారంభించానని..డబ్బుకూడా బాగా వస్తుందని చెప్పాడు. దీంతో రేణుక కూడా సంతోషించింది. ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తే బాగా సంపాదించవచ్చు..కాబట్టి నువ్వు ఉద్యోగం మానేయమన్నాడు. దానికి రేణుక కూడా సరేనని ఉద్యోగం వదిలిపెట్టేసింది.
వ్యాపారం ఏంటీ అనే విషయం అప్పుడు చెప్పాడు సిద్ధార్థ రేణుకతో. ఆమె భయపడింది. దొరికితే ఇద్దరి పరిస్థితి ఏంటీ అని అడిగింది. దానికి సిద్ధార్థ ఏమీ భయపడాల్సి పనిలేదు. రిస్క్ చేయకపోతే డబ్బెలా వస్తుంది?అని రేణుకను కన్విన్స్ చేశాడు. నువ్వు కూడా ఈ పనిచేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చాడు. దీంతో రేణుక కూడా ప్రియుడితోకలిసి గంజాయి దందాలో పడింది.
ఈక్రమంలో 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో సిద్దార్థ రేణుకను గంజాయి అమ్మటానికి బెంగళూరుకు పంపించాడు. ఆమె బెంగళూరులోని మారతహళ్లి సమీపంలోని పీజీ హాస్టల్లో ఉండి కొంతమందికి గంజాయి సప్లై చేస్తుండేది. అలా బిహార్కు చెందిన సుధాంశు అనే వ్యక్తితో కలిసి గంజాయి విక్రయాలు ప్రారంభించింది. మొదట చిన్నగా మొదలు పెట్టి రాను రాను కాస్త ఎక్కువగా అమ్మటం మొదలైంది. అలా ప్రియుడు సిద్ధార్థ్ పెద్దమొత్తంలో గంజాయిని తీసుకువస్తే రేణుక చిన్న చిన్న ప్యాకెట్లుగా డివైడ్ చేసి వాటిని పలువురికి అమ్ముతుండేది. ఇలా కొంతకాలంపాటు వీరి వ్యాపారం బాగానే సాగింది. డబ్బుల కూడా బాగానే సంపాదించారు.
ఈక్రమంలో గత మంగళవారం రాత్రి సదాశివనగర ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నట్లుగా పక్కా సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా వేశారు. ఇంకేముంది? సుధాంశుకు రేణుక గంజాయి ప్యాకెట్లు ఇస్తుండగా ఎస్ఐ లక్ష్మీతో కలిసి సీఐ ఎంఎస్ అనిల్కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సుధాంశును కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరినీ పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. చక్కగా ఉద్యోగం చేసుకునే రేణుక ప్రియుడి మాటలను నమ్మి పోలీసులకు చిక్కింది. ఆమెను విచారించిన పోలీసులు సిద్ధార్థ విషయం కూడా తెలుకుని సిద్ధార్థ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.