Owaisi Junction: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు చేపట్టిన వ్యూహాత్మక ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తికావొస్తుంది. ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా.. ఇవాళ్టి నుంచి ఒవైసీ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫైఓవర్ అందుబాటులోకి వస్తుండడంతో మిధాని జంక్షన్ వైపు నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్లే వారికి ఉపశమనం కలిగినట్లుగా అయ్యింది.
మిధాని, ఒవైసీ జంక్షన్ల వద్ద ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయని అభిప్రాయపడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా డీఆర్డీఓ, డీఆర్డీఏ, ASL తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ఈ ఫ్లైఓవర్ తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.. ఇక ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో కూడా ఇబ్బందులు తప్పనున్నాయి.
80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్లో క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ పానెల్స్ లాంటి పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వాడారు. దీని వల్ల ఎంతో సమయం కలిసి రావడంతోపాటు మ్యాన్పవర్ తగ్గిందని, పని ప్రదేశంలో ప్రమాదాల రిస్క్ తగ్గిందని అధికారులు తెలిపారు. దేశంలో ఇలాంటి టెక్నాలజీ హైదరాబాద్లోనే తొలిసారి వినియోగించగా, పాతబస్తీలో ఇదే ప్రథమమన్నారు.