Punjab Politics చండీగఢ్లోని పంజాబ్ భవన్ లో పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ ముగిసింది. రెండు రోజుల క్రితం పీసీసీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. తన అభ్యంతరాలను చన్నీకి వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. అయితే, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై స్పష్టత లేదు. ఇక, ముఖ్యమంత్రి చన్నీ అక్టోబర్ 4న అత్యవసర మంత్రివర్గ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో… ఈ రోజునే అన్ని విషయాలకు సమాధానం దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. సిద్ధూ ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ALSO READ ఉత్తర కొరియాలో కీలక మార్పులు..కిమ్ సోదరికి అధ్యక్ష బాధ్యతలు?
కాగా,సెప్టెంబర్ 28న పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తాత్కాలిక డీజీపీ, అడ్వొకేట్ జనరల్ల నియామకంపై బుధవారం.. తన అసంతృప్తిని బయటపెట్టారు సిద్ధూ. మంత్రివర్గంలో కళంకితులకు చోటుదక్కడం కూడా తనను తీవ్ర కలతకు గురిచేసిందన్నారు. పంజాబ్ సంక్షేమంపై రాజీ పడటం ఇష్టంలేకే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు 4 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే సిద్దూ రాజీనామాని కాంగ్రెస్ అధిష్ఠానం ఇంతవరకు ఆమోదించలేదు. రాష్ట్ర స్థాయిలోనే విభేదాలను పరిష్కరించుకోవాలని సీఎం చన్నీ, సిద్ధూలకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది.
రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చన్నీ.. బుధవారం కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం సిద్ధూతో ఫోన్లో మాట్లాడారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం చన్నీ-సిద్ధూ భేటీ జరిగింది.
ALSO READ బీజేపీలో చేరట్లేదు.. కాంగ్రెస్లో ఉండను.. ఆప్ ప్రభావం పెరిగింది – మాజీ సీఎం
రాజీనామాపై సిద్ధూ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. పంజాబ్ పీసీసీ చీఫ్గా సిద్ధూనే కొనసాగుతారని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని సదరు వర్గాలు తెలిపాయి.