Manipur – Opposition delegation: మణిపూర్లో అతి దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్న వేళ శని, ఆదివారాల్లో ప్రతిపక్ష నేతల కూటమి (INDIA) ఎంపీల బృందం ఆ రాష్ట్రానికి పర్యటిస్తుంది. అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి పార్లమెంట్ ఉభయసభల నుంచి 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు వెళ్లారు.
హింస చెలరేగిన ప్రాంతాలు, అక్కడి సహాయక కేంద్రాలను సందర్శిస్తున్నారు. బాధితులను కలిసి వారి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. అలాగే, ఆదివారం ఉదయం మణిపూర్ గవర్నర్ను కలుస్తారు. మణిపూర్లో ఇండియా నేతలు పరిశీలించిన అంశాలను పార్లమెంటులో చర్చించాలని ఆ కూటమి నేతలు అంటున్నారు.
ప్రభుత్వం అనుమతించకపోతే మీడియా సమావేశంలో మాట్లాడుతామని అన్నారు. ఇండియా కూటమి నుంచి అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, రాజీవ్ రంజన్ లాలన్ సింగ్, సుస్మితా దేవ్, కనిమొళి కరుణానిధి, సంతోష్ కుమార్, ఏఏ రహీమ్, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, జావేద్ అలీ ఖాన్, మహువా మాజి, మహమ్మద్ ఫైజల్, అనీల్ ప్రసాద్ హెగ్డే, మహమ్మద్ బషీర్, ప్రేమ్ చంద్రన్, సుశీల్ గుప్తా, అరవింద్ సావంత్, రవికుమార్, తిరు తోల్ తిరుమావళవన్, జయంత్ సింగ్, ఫూలో దేవి నేతమ్ వెళ్లారు.
మణిపూర్ వెళ్లేముందు డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడుతూ… ‘‘ మణిపూర్ వెళ్తున్నాము.. మేము మద్దతుగా ఉంటామని అక్కడి ప్రజలకు తెలుపుతాము. మేము వారి కోసం పోరాడుతున్నామని చెబుతాము. గవర్నర్ ను కలిసేందుకు కూడా అనుమతి అడిగాము. మణిపూర్ పై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో సమాధానం చెబుతారని ఆశిస్తున్నాం ’’ అని చెప్పారు.
CM KCR – Bhim Army : భీం ఆర్మీ మహాసభలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం