Punjab Cabinet Expansion వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీలో ఎన్నికలు జరుగనున్న పంజాబ్లో ఇవాళ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు..మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిచేత పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. చండీగఢ్లోని రాజ్భవన్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్సింగ్ సిద్ధూ, ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో బ్రహ్మ్ మొహింద్రా, మన్ప్రీత్సింగ్ బాదల్, త్రిప్త్ రాజిందర్సింగ్ బజ్వా, సుఖ్బిందర్ సింగ్ సర్కారియా, రాణా గుర్జీత్సింగ్, అరుణ చౌదరి, రజియా సుల్తానా, భరత్ భూషణ్ అషు, విజయ్ ఇందర్ సింగ్లా, రణ్దీప్ సింగ్ నభా, రాజ్కుమార్ వెర్క, సంగత్ సింగ్ గల్జియాన్, పర్గత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, గుర్కీరట్ సింగ్ కొట్లీ ఉన్నారు. కొత్త మంత్రులలో ఏడుగురు కొత్త వారు ఉన్నారు. కొత్తగా మంత్రి పదవి దక్కించుకున్నవారిలో..రణ్దీప్ సింగ్ నభా, రాజ్ కుమార్ వెర్కా, సంగత్ సింగ్ గిల్జియాన్, పర్గాత్ సింగ్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, గుర్కీరత్ సింగ్ కోట్లి ఉన్నారు.
READ యూపీ కేబినెట్ విస్తరణ..జితిన్ ప్రసాదకు చోటు
2018లో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన రానా గుర్జిత్ సింగ్.. మరోసారి కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. రాణా గుర్జీత్సింగ్.. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. అయితే మైనింగ్ కుంభకోణం విషయంలో ఆరోపణలు రావడంతో 2018 జనవరిలో ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మైనింగ్ కుంభకోణం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా గుర్జీత్సింగ్కు మంత్రి పదవి ఇవ్వవద్దని ఆరుగురు ఎమ్మెల్యేలు లేఖలు రాసినా.. సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ ఆయనకు మంత్రిపదవి కట్టబెట్టేందుకే మొగ్గుచూపారు.
మరోవైపు,రాజ్భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సొంత ఎమ్మెల్యేలే నిరసన గళం వినిపించారు. అమరీందర్ సింగ్ ప్రభుత్వంలోని కొందరు మంత్రుల్ని ఈసారి పక్కనపెట్టారు. దీనిపై వారు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పలువురు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చన్నీకు లేఖ రాశారు. ఇక,కేబినెట్ నుంచి తప్పించడాన్ని తప్పుబడుతూ.. కెప్టెన్ మంత్రివర్గంలో పనిచేసిన బల్బీర్ సింగ్ సిద్ధూ, గుర్ప్రీత్ సింగ్ కంగర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తమను మంత్రివర్గం నుంచి తొలగించడానికి కారణాలేంటని ప్రశ్నించారు. ఓ దశలో బల్బీర్ సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. తాము చేసిన తప్పేంటని ఆవేదన వ్యక్తం చేశారు.