Kuno National Park: దేశంలో చిరుతల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ఆఫ్రికా నుంచి ఇప్పటికే ఎనిమిది చిరుతలను ఇండియాకు తీసుకొచ్చారు. గతేడాది సెప్టెంబర్లో నమీబియా నుంచి ఎనిమిది (ఐదు ఆడ, మూడు మగ) చిరుతలు భారతదేశంలో అడుగుపెట్టాయి. ప్రత్యేక విమానం ద్వారా నమీబియా నుంచి వీటిని తరలించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్క్లోజర్లోకి ప్రధాని నరేంద్ర మోదీ వీటిని విడుదల చేశారు. వీటిని కొద్దిరోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.
కునో నేషనల్ పార్క్ 750 చదరపు కిలో మీటర్లలో విస్తరించి ఉంది. ఇది 6800 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బహిరంగ అటవీ ప్రాంతంలో ఒక భాగం. తొలుత తెచ్చిన ఎనిమిది చిరుతలను ఎన్క్లోజర్ నుంచి అటవీ ప్రాంతంలోకి వదిలేశారు. కునో నేషనల్ పార్కులో చిరుతలకు నివాసం, ఆహారం, నీటిని అందుబాటులో ఉంచారు. అయితే, ఫిబ్రవరి చివరి వారంలో మరో 12 చిరుతలను కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Cheetahs in kuno national park: చీతా… క్షేమమే..!
చిరుత ప్రాజెక్టులో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు ఈనెలాఖరు నాటికి భారతదేశంలో అడుగుపెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ – దక్షిణాఫ్రికా దేశాల మధ్య జనవరి 26న ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో అడుగుపెట్టే చిరుతలకోసం కునో నేషనల్ పార్కులో పది ఎన్క్లోజర్లను సిద్ధం చేశారు. మొత్తం 12 చిరుతలు పార్కుకు రానున్నాయి. కొత్తగా ఎనిమిది ఎన్ క్లోజర్లను సిద్ధం చేయగా, పాతవి నాలుగు ఎన్క్లోజర్లను రెండింటిగా మార్చారు. కొత్తగా వచ్చే చిరుతలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పార్కు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, 12 చిరుతలు కునో పార్కుకు ఎప్పుడు చేరుతాయో స్పష్టమైన తేదీ నిర్ణయం కాలేదు.