Chandrabose : అమెరికాలోని డల్లాస్ లో డాక్టర్ మీనాక్షి అనుపిండి దాదాపు 21 ఏళ్లుగా అక్కడ సుస్వర మ్యూజిక్ అకాడమీ స్థాపించి ఎంతోమందికి శాస్త్రీయ సంగీతం నేర్పిస్తున్నారు. ఈ సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ప్రతి ఏడాది వార్షికోత్సవాలను డల్లాస్ లో నిర్వహిస్తున్నారు. తాజాగా డల్లాస్ గ్రాండ్ సెంటర్ ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలువురు తెలుగు ప్రముఖులు ప్రసాద్ తోటకూర, గోపాల్ పోనంగి, కిషోర్ కంచర్ల, శారద సింగిరెడ్డి, ప్రకాష్ రావు.. లతో పాటు అక్కడి తెలుగు వారు హాజరయ్యారు. అలాగే సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్, డైరెక్టర్ వి.ఎన్. ఆదిత్య.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Also Read : Rajamouli : బాహుబలి సిరీస్లు వస్తూనే ఉంటాయి.. ఫ్యాన్స్కి పండగే.. యానిమేషన్ సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే..
ఈ కార్యక్రమంలో మీనాక్షి అనిపిండి తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో 10 గంటల పాటు దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారికి సన్మానం నిర్వహించి ‘సుస్వర సాహిత్య కళానిధి’ అనే బిరుదుతో సత్కరించారు. అలాగే చంద్రబోస్ తన స్వగ్రామం చల్లగరిగెలో కడదామనుకున్న ఆస్కార్ గ్రంధాలయ నిర్మాణానికి, ఈ కార్యక్రమం ద్వారా 15 వేల డాలర్స్ కు పైగా విరాళం అందించారు. అనంతరం సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ కి ‘సుస్వర నాదనిధి’ అనే బిరుదుతో సత్కరించారు. దీంతో చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్ లకు అభినందనలు తెలుపుతున్నారు.