Telangana : తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ మధ్య ధాన్యం దంగల్ మరింత ముదురుతోంది. వడ్ల కొనుగోలుపై నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. యాసంగిలో పండిన పంటనంతా కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణ కోరుతుంటే.. ధాన్యం సేకరణలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ కేంద్రం ఎదురుదాడికి దిగింది. దీంతో వరి వార్ మరింత హీట్ను పెంచుతోంది.
ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడోపేడో తెలుసుకోవడానికి హస్తిన బాటపట్టిన తెలంగాణ మంత్రులకు నిరాశే ఎదురైంది. మధ్యాహ్నం కేంద్రమంత్రి పియూష్ గోయల్తో సమావేశమైన మంత్రులు.. తెలంగాణ డిమాండ్లను కేంద్ర మంత్రి ముందుంచారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందనుకున్న వారికి.. ఊహించని షాక్ తగిలింది. మీటింగ్ తర్వాత మీడియా ముందుకొచ్చిన కేంద్రమంత్రి పియూష్ గోయల్.. తెలంగాణ సర్కార్ను టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అంటూ రివర్స్ ఎటాక్కు దిగారు.
తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. కేసీఆర్ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. ధాన్యం సేకరణ విషయంలో కావాలనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు అడిగినా ముడి ధాన్యం ఎంత ఇస్తారో చెప్పడం లేదన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు వివరాలు పంపినా.. తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు పీయూష్.
ఎంత ముడి బియ్యం ఇస్తారని అడిగితే తెలంగాణ ఎలాంటి వివరాలు ఇవ్వలేదని ఆరోపించారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. ధాన్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వ చేస్తున్న ప్రచారం అవాస్తవం, నిరాధారమన్నారు. పంజాబ్కు అనుసరిస్తున్న విధానాన్నే తెలంగాణకూ అనుసరిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న కేంద్రమంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి. తాము రైతులకు రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇస్తున్నారా అని నిలదీశారు. రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తమపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు.
అటు.. కేంద్రమంత్రి పియూష్ గోయల్, తెలంగాణ మంత్రి ప్రశాంత్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ధాన్యం కొనుగోలుపై మాట్లాడుతుండగా.. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. పంజాబ్లో సేకరించినట్టుగా తెలంగాణలో ఎందుకు చేయరని నిలదీశారు మంత్రి ప్రశాంత్రెడ్డి.
Also Read :YCP-TDP : ఏపీలో లిక్కర్ బ్రాండ్లపై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్
రైతుల మేలు కోసం ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చాలని కోరగా.. ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు పీయూష్. మీరు ఢిల్లీలో అధికారంలోకి వస్తారుగా.. అప్పుడు మార్చండి అంటూ ఎద్దేవా చేశారు. దేవుడి దయతలిస్తే తప్పకుండా వస్తామంటూ కౌంటర్ ఇచ్చారు ప్రశాంత్రెడ్డి
ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. ధాన్యం విషయంలో రాజకీయం రాజుకుంటోంది. అటు సీఎం కేసీఆర్ టార్గెట్ బీజేపీ అంటుంటే.. బీజేపీ రివర్స్ ఎటాక్కు దిగడంతో ధాన్యం పంచాయితీ మరింత హాట్గా మారింది.