Yashasvi Jaiswal-Shubman Gill
West Indies vs India : నెల రోజుల విరామం తరువాత టీమ్ఇండియా తొలి సిరీస్ ఆడుతోంది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్లో భాగంగా వెస్టిండీస్, భారత జట్ల మధ్య నేటి(జూలై 12) నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత జట్టే ఫేవరేట్గా బరిలోకి దిగుతుండగా, సొంత గడ్డపై యువకులతో కూడిన వెస్టిండీస్ ను తక్కువ అంచనా వేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి నేపథ్యంలో భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా నయా వాల్ ఛతేశ్వర పుజారా పై వేటు పడింది. యువ ఆటగాళ్లు యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్లకు తొలిసారి టెస్టు జట్టులో స్థానం దక్కింది. వీరిలో యశస్వి జైశ్వాల్ నేటి మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేయనున్నాను. అతడు తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలోనే బరిలోకి దిగనున్నాడు.
ఈ విషయాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే తెలియజేశాడు. ఇక రెగ్యులర్ గా రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేస్తున్న శుభ్మన్ గిల్ నయా వాల్ పుజారా స్థానంలో అంటే వన్డౌన్లో బరిలోకి దిగనున్నాడు. ఆ తరువాత విరాట్ కోహ్లి, రహానేలు వస్తారు. ఇషాన్ కిషన్, కేఎస్ భరత్లలో వికెట్ కీపర్గా ఎవరు ఆడతారు అన్న దానిపై సందిగ్థం నెలకొంది. భరత్ కీపింగ్లో రాణిస్తున్న బ్యాటింగ్లో సక్సెస్ కాలేకపోతున్నాడు. దీంతో ఇషాన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
టీమ్ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయం. అయితే.. వికెట్ కీపింగ్ నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుంటే భరత్నే కొనసాగించే అవకాశం లేకపోలేదు. వ్యక్తిగతంగా, సారథిగా రోహిత్ శర్మకు ఈ సిరీస్ పరీక్షనే. డబ్ల్యూటీసీ ఫైనల్ ద్వారా జట్టులోకి పునరాగమనం చేసిన రహానే ఎలా ఆడతాడో అన్నది ఆసక్తికరం. అతడు విఫలం అయితే మాత్రం ఇదే అతడికి ఆఖరి సిరీస్ కావొచ్చు.
WI vs IND : వెస్టిండీస్పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో తెలుసా..?
మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడంతో సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనున్నాను. సిరాజ్తో పాటు శార్దూల్ ఆడడం ఖాయం. ఇక మూడో పేసర్గా జైదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ, ముకేశ్ కుమార్లలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. అశ్విన్, జడేజాలు స్పిన్ బాధ్యతలను మోయనున్నారు.
పోటీ నిస్తుందా..?
వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నీలో పేలవ ప్రదర్శన చేసింది వెస్టిండీస్. తొలిసారి వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోయింది. దీంతో సీనియర్లను కాదని యువ ఆటగాళ్లకు టెస్టు జట్టులో చోటిచ్చారు. వీరు ఎంత మేరకు రాణిస్తారు అన్నది ప్రశ్న. బ్యాటింగ్లో కెప్టెన్ బ్రాత్వైట్, టగ్ నారాయణ్ చంద్రపాల్, బ్లాక్వుడ్ కీలకం కానున్నారు. బ్యాటింగ్లో బలహీనంగా కనిపిస్తున్నా పేస్ బౌలింగ్ మాత్రం చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. కీమర్ రోచ్, గాబ్రియల్, అల్జారి జోసెఫ్, హోల్డర్ లు తమకు అనువైన కండిషన్లలో భారత బ్యాటర్లకు సవాల్ విసిరేందుకు సిద్దం అయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత జట్టులోకి వచ్చిన భారీ కాయుడైన స్పిన్ ఆల్రౌండర్ రఖీమ్ కార్న్వాల్పై అందరి దృష్టి నిలవనుంది.
ఎన్నిసార్లు తలపడ్డారు అంటే..?
వెస్టిండీస్ గడ్డపై భారత జట్టు 51 టెస్టులు ఆడింది. 9 టెస్టుల్లో విజయం సాధించగా 16 మ్యాచుల్లో ఓడింది. 26 టెస్టులు డ్రా అయ్యాయి. ఓవరాల్గా ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 98 టెస్టులు జరిగాయి. భారత్ 22 టెస్టులు గెలవగా, విండీస్ 30 గెలిచింది. 46 టెస్టులు డ్రా అయ్యాయి.
తుది జట్ల (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్/ఉనద్కత్.
వెస్టిండీస్ : బ్రాత్వైట్ (కెప్టెన్), టగ్ నారాయణ్ చంద్రపాల్, రీఫర్, రఖీమ్ కార్న్వాల్, బ్లాక్వుడ్, అథనేజ్, జోష్వా ద సిల్వా, హోల్డర్, అల్జారి జోసెఫ్, కీమర్ రోచ్, షనోన్ గాబ్రియల్