WTC Final:ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final ) మ్యాచ్పై ఆస్ట్రేలియా(Australia) పట్టు సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(41), కామెరూన్ గ్రీన్(7)లు ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) రెండు వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్(Umesh Yadav), మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)లు చెరో వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని ఆస్ట్రేలియా ప్రస్తుతం 296 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 469 పరుగులకు ఆలౌట్ కాగా టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్లో 296 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియాకు 173 పరుగుల కీలకమైన మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉంది. నాలుగో రోజు వీలైనంత వేగంగా పరుగులు చేసి డిక్లేర్ చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్కు కష్టంగా మారుతున్న పిచ్పై 350 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే టీమ్ఇండియాకు కష్టమే.
Steve Smith: డబ్ల్యూటీసీ ఫైనల్లో స్టీవ్ స్మిత్ సెంచరీ.. పలు రికార్డులు బ్రేక్
కొరకరాని కొయ్యగా లబుషేన్
టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్ ముగియడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. అయితే.. ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్ గట్టి షాక్ ఇచ్చాడు. స్కోరు బోర్డుపై రెండు పరుగులు చేరాయో లేదో పేలవ ఫామ్ను కొనసాగిస్తూ డేవిడ్ వార్నర్(1) పెవిలియన్కు చేరుకున్నాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(13)ని ఉమేశ్ యాదవ్ బోల్తా కొట్టించాడు. 24 పరుగులకే పరుగులకే ఓపెనర్లు ఇద్దరు ఔట్ అయ్యారు.
సీనియర్ ఆటగాడు, తొలి ఇన్నింగ్స్లో శతకం చేసిన స్టీవ్ స్మిత్(34), మార్నస్ లబుషేన్లు ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఓ ఎండ్లో లబుషేన్ క్రీజులో పాతుకుపోగా స్మిత్ ధాటిగా ఆడాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని స్మిత్ను ఔట్ చేయడం ద్వారా జడేజా విడగొట్టాడు. స్మిత్-లబుషేన్ జోడి మూడో వికెట్కు 62 పరుగులు జోడించారు. ఆ తరువాత కాసేటికే మొదటి ఇన్నింగ్స్లో భారీ శతకం చేసిన ట్రావిస్ హెడ్(18)ని సైతం జడేజానే ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కామెరూన్ గ్రీన్తో కలిసి లబుషేన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.
WTC Final 2023: టీమ్ ఇండియా 296 ఆలౌట్.. ఆసీస్కు 173 రన్స్ ఆధిక్యం
145 పరుగులు 5 వికెట్లు
అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 151/5 మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 145 పరుగలు జోడించి మిగిలిన వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానే(89), శార్దూల్ ఠాకూర్(51) అర్ధశతకాలతో రాణించగా జడేజా(48) పర్వాలేదనిపించడంతో మొదటి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు తీయగా, బొలాండ్, గ్రీన్, స్టార్క్ లు తలా రెండు, నాథన్ లియోన్లు ఓ వికెట్ పడగొట్టాడు.