ఎన్నికల వేళ ఏపీలో భారీగా నగదు సీజ్.. పైపుల లోడ్ లారీలో తరలిస్తుండగా పట్టివేత
ఆ నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను..
- T Venkateshwarlu
- Published On : May 9, 2024 / 08:40 AM IST
Andhra Pradesh: ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఇవాళ ఉదయం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ.8.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పైపుల లోడ్ లారీలో ఈ నగదు పట్టుబడడం గమనార్హం. ఆ నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ డబ్బు ఎవరిదనే దానిపై విచారణ చేపట్టారు.
మరోవైపు, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటలో గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. కోటి రూపాయలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే ఏపీలో భారీగా నగదు పట్టుబడింది. ఏపీలో ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులే సమయం మిగిలి ఉంది.
మే 13న ఎన్నికలు జరుగుతుండటంతో సర్వశక్తులొడ్డి ఎన్నికల పోరాటానికి సిద్ధమవుతున్నాయి ఏపీలోని పార్టీలు. తమకు కలిసొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
Also Read : ఎన్నికల విధులకు గైర్హాజరు.. 40 మందిపై సస్పెన్షన్ వేటు!
