JP Nadda-Kejriwal: దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆ అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తి మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రజల ఆంక్షలను నెరవేర్చేందుకు నిబద్ధతతో ఐదేళ్లపాటు పనిచేస్తాం’ అని చెప్పారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాడతామని చెప్పారు.
బీజేపీ నేత, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ… తమ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై నిలదీస్తామని చెప్పారు. అన్ని అభివృద్ధి పనులూ నిలిచిపోయాయని, లిక్కర్, కోల్ స్కాములు జరిగాయని విమర్శలు గుప్పించారు.
జమ్మూకశ్మీర్ లో ఇంకెప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ఈసీకి అనుమతి దక్కడం లేదని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు.