Rain Forecast – IMD Alert : దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతులం చేస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) భారీ వర్ష సూచన చేసింది. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
సెప్టెంబర్ 14వ తేదీ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య భారతదేశంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవశాలున్నాయని వెల్లడించింది. సెప్టెంబర్ 12 నుంచి ఒడిశా, ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ వర్షం కురిసింది. 12 గంటల్లో అత్యధికంగా 90 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదు అయింది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయం వరకూ కొనసాగింది. ఈ వర్షానికి పలు ప్రధాన రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.
మంగళవారం వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటావా, ఔరైయా, గొండా, కన్నౌజ్, అయోధ్య సహా పలు జిల్లోల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు అలర్ట్ అయ్యారు. ఈమేరకు లక్నోలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు సెప్టెంబర్ 12వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.