Maoism Elimination : మావోయిస్ట్ కీలక నేతలే టార్గెట్.. బోర్డర్‌లోని బలగాలను డైరెక్ట్ చేస్తున్న కేంద్రం

నాయకుడు లేని సేన.. చెల్లాచెదురైపోతుంది..అనే బాహుబలి సినిమా డైలాగ్ నే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలనలో ఉపయోగిస్తోందా? అంటే నిజమేననిపిస్తోంది. మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం మావోయిస్టు కీలక లీడర్లనే టార్గెట్ గా పెట్టుకుంది.

Maoism Elimination :  నాయకుడు లేని సేన.. చెల్లాచెదురైపోతుంది..అనే బాహుబలి సినిమా డైలాగ్ నే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలనలో ఉపయోగిస్తోందా? అంటే నిజమేననిపిస్తోంది. మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం మావోయిస్టు కీలక లీడర్లనే టార్గెట్ గా పెట్టుకుంది. ఎన్ని ఎన్‌కౌంటర్లు చేసినా.. మావోయిస్టుల సంఖ్య తగ్గటంలేదు. అదే మావోయిస్ట్ కీలక నేతలను కంట్రోల్‌ చేస్తే .. మొత్తం మావోయిస్ట్ దళాలన్నీ చెల్లాచెదురైపోతాయ్. వారిని నడిపించే నేతల లేకపోతే దళాలు చీలిపోతాయనే నాయకుడు లేని సేన.. చెల్లాచెదురైపోతుంది..అనే బాహుబలి డైలాగ్ ను అమలు చేయాలని భావిస్తోంది. దళాలు మళ్లీ కోలుకోకుండా.. పూర్తిగా న్యూట్రలైజ్ చేయడమే ఇప్పుడు కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. దానికోసమే.. మావోయిస్ట్ కీలక నేతలను టార్గెట్ చేశాయి పోలీసుల బలగాలు.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా.. ఇలా స్టేట్ ఏదైనా.. బోర్డర్ ఏదైనా.. పోలీసు బలగాల టార్గెట్ ఒక్కటే. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం. ఈ విషయంలో.. కేంద్రమే నేరుగా బోర్డర్‌లోని బలగాలను డైరెక్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులపై ఆరా తీస్తోంది. ఫైనల్‌గా.. మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించాలంటే.. ఎన్‌కౌంటర్ చేయాల్సింది దళ సభ్యులను కాదు.. దళ నాయకుడిని అనే అంచనాకు వచ్చింది. అందుకోసమే.. మావోయిస్టులను కాకుండా.. మావోయిస్ట్ కీలక నేతలైన.. పెద్ద తలకాయలకే గురి పెట్టింది కేంద్రం. ఇందుకోసం.. అవసరమైన స్కెచ్‌లన్నీ గీస్తున్నారు. ఇప్పుడు బలగాల టార్గెట్ ఒక్క హిడ్మా మాత్రమే కాదు. కాకపోతే.. ఈ లిస్టులో ముందున్నది హిడ్మానే. అతన్ని ఎన్‌కౌంటర్ చేస్తే.. ఛత్తీస్‌గఢ్ మావోయిస్ట్ పార్టీలో ధృడంగా ఉన్న అతని దళం.. బలహీనపడుతుందనేదే ప్లాన్. అందుకే.. హిడ్మా లక్ష్యంగా హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించి దాడులు జరుపుతున్నారు.

చాలాకాలం పాటు పోలీసులకు ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్తపడిన హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అలాంటి హిడ్మాను.. ఎవరూ చంపలేరని మావోయిస్ట్ పార్టీలో ఓ గుడ్డి నమ్మకమైతే ఉంది. అలాంటి దళ నాయకుడిని ఎన్‌కౌంటర్ చేస్తే.. క్యాడర్‌ని నైతికంగా ఎదురుదెబ్బ కొట్టొచ్చని పోలీసులు చెబుతున్నారు. గతంలో చాలా ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా.. తాజాగా సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ చనిపోలేదని మావోయిస్ట్ పార్టీ చెబుతోంది. ఇంతకుముందు కూడా చాలా సార్లు హిడ్మా చనిపోయాడనే వార్తలు వచ్చాయి. అయితే.. తర్వాత హిడ్మా బతికే ఉన్నాడని తేలింది. ఇప్పుడు కూడా పోలీసులు.. అతను చనిపోయినట్లు ధ్రువీకరించలేదు. అక్కడ జరిగిన విషయం ఏదైనా.. మావోయిస్ట్ కీలక నేతలను హతమార్చడం మీదే కేంద్రం, రాష్ట్రాల పోలీసు బలగాలు దృష్టి పెట్టాయి. అందుకోసం.. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి.

Chhattisgarh : శరణు అంటే ప్రాణభిక్ష లేదంటే మరణశిక్ష అంటున్న కేంద్రం..2024నాటికి మావోయిస్ట్ రహిత దేశంగా భారత్ మారుస్తామన్న అమిత్ షా

ఏం చేసైనా సరే.. 2024 నాటికి దేశాన్ని మావోయిస్ట్ రహితంగా మార్చేందుకు అన్ని చర్యలను తీసుకుంటోంది కేంద్రం. అడవుల్లో వేళ్లూనుకుపోయిన మావోయిస్టులను, మావోయిజాన్ని.. కూకటివేళ్లతో సహా పెకిలించి.. ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించుకుంది కేంద్రం. ఇందుకోసం.. మావోయిస్టుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. కేంద్రం డైరెక్షన్‌లో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలకు చెందిన పోలీస్ శాఖలు కలిసి పనిచేస్తున్నాయ్. సరిహద్దుల్లో ఏమాత్రం అలజడి రేగినా.. పోలీసులంతా కలిసి తిప్పికొడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం.. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో నక్సల్స్ ప్రభావం చాలా వరకు తగ్గిందని.. కేంద్ర హోంశాఖ చెబుతోంది. మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్న ప్రాంతాల్లో డీజీపీలు కూడా తరచూ సున్నిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఎప్పటికప్పుడు బలగాలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

మావోయిస్ట్ వ్యవస్థ నిర్మూలన కోసం కొన్నేళ్లుగా కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో.. రోడ్లు, బ్రిడ్జిలు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్ల అభివృద్ధిపై సర్కార్ దృష్టి పెట్టింది. దీంతో పాటు మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్లు, భద్రతా పరమైన లోపాలను సరిదిద్దుకోవడం లాంటి వాటిపైనా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే.. మావోయిస్ట్ అనుబంధ సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి నిధుల సమీకరణకు అడ్డుకట్ట వేస్తున్నారు. రాష్ట్రాల పోలీసులతో పాటు స్పెషల్ ఫోర్సెస్ విషయంలో.. పరస్పర సాయం, సమన్వయం కూడా కుదిర్చింది కేంద్ర హోంశాఖ.

నాలుగున్నరేళ్ల క్రితం.. దేశంలో మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల సంఖ్య వంద ఉంటే.. 2021 నాటికి 70కి తగ్గాయ్. అప్పటికి.. కేవలం 25 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉందని తెలిపింది కేంద్రం. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నక్సలైట్ల హింసాత్మక ఘటనలు కూడా 50 శాతానికి పైనే తగ్గాయి. 2015 నుంచి ఇప్పటివరకు 4 వేల 2 వందల మందికి పైనే మావోయిస్టులు లొంగిపోయారు. గత పదేళ్లలో దేశంలో నక్సలైట్ల హింసాత్మక ఘటనలు కూడా తగ్గుముఖం పట్టాయి. 2009లో 2 వేల 258గా ఉన్న మావోయిస్టుల హింసా ఘటనల సంఖ్య.. 2021 నాటికి 509కి తగ్గింది. అంటే.. చాలా జిల్లాల్లో మావోయిస్టులను నిర్మూలించడంలో బలగాలు సక్సెస్ అయ్యాయనే చెప్పొచ్చు. ఇదే దూకుడును కొనసాగించి.. దేశంలో మావోయిజం అనేదే లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.

 

ట్రెండింగ్ వార్తలు