Electricity Bill Kills - Odisha(Photo : Google)
Electricity Bill Kills – Odisha : ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో దారుణం జరిగింది. కరెంటు బిల్లు ఎక్కవ వచ్చిందని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. మీటర్ రీడింగ్ ఉద్యోగిని దారుణంగా హత్య చేశాడు. తార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుపాటి గ్రామానికి చెందిన గోబింద సేతీ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇటీవల అతడికి కరెంటు బిల్లు వచ్చింది. అయితే బిల్లు చాలా ఎక్కువగా ఉంది.
దాంతో అతడు మీటిర్ రీడింగ్ తీసే ఉద్యోగి లక్ష్మీ నారాయణ త్రిపాఠిని ప్రశ్నించాడు. ఎందుకు బిల్లు ఎక్కువగా వచ్చింది అని నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగింది. ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో గోబింద సేతీ కోపంతో ఊగిపోయాడు. విచక్షణ కోల్పోయాడు. మీటర్ రీడింగ్ ఉద్యోగిపై దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. అంతటితో అతడి కోపం చల్లారలేదు. పదునైన ఆయుధంతో పొడిచాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలతో త్రిపాఠి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(TPSODL) లో మీటర్ రీడింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కరెంటు బిల్లు రీడింగ్ తీసేందుకు కుపాటీ గ్రామానికి వెళ్లాడు. అక్కడ గోబింద సేతీ అనే వినియోగదారుడి చేతిలో హతమయ్యాడు. త్రిపాఠి గ్యాలరీ గ్రామస్తుడు. కరెంటు బిల్లు ఎక్కువ రావడం ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది.
మీటర్ రీడింగ్ ఉద్యోగి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. మీటర్ రీడింగ్ ఉద్యోగులను భయాందోళనకు గురి చేసింది. త్రిపాఠి మృతదేహంతో వారు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. త్రిపాఠి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని, త్రిపాఠి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఉద్యోగిని హత్య చేసిన గ్రామస్తుడు సేతీని పోలీసులు అరెస్ట్ చేశారు.