Ranveer Singh Kisses MS Dhoni : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ని బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కలిశాడు. ఈ విషయాన్ని స్వయంగా రణ్వీర్ తెలియజేశాడు. ధోనిని కలుసుకున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మేరా మహి @మహి7781, హీరో, ఐకాన్, లెజెండ్,బిగ్ బ్రదర్ అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి.
రెండు ఫోటోలను రణ్వీర్ షేర్ చేశాడు. ఓ ఫోటోలో ఇద్దరు నవ్వుతూ కనిపిస్తుండగా.. మరో ఫోటోలో రణ్వీర్ ప్రేమతో ధోని బుగ్గపై కిస్ చేశాడు. ఈ ఫోటోల్లో రణ్వీర్ నల్లటి టీ షర్ట్ ధరించగా, ధోని నీలిరంగు షర్ట్లో కనిపించాడు. కాగా..రణవీర్, ధోనీ లు తరచుగా కలుసుకుంటారు. గతేడాది వీరిద్దరూ ఫుట్బాల్ ఆడుతూ కనిపించారు. అయితే.. వీరు ఇద్దరు ఇప్పుడు ఏ విషయమై కలుసుకున్నారు..? ఏం మాట్లాడుకున్నారు అన్న విషయాలు అయితే తెలియరాలేవు.
ఇటీవల రామ్చరణ్ కూడా..
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కూడా బుధవారం (అక్టోబర్ 4) ధోని ని కలిశాడు. చరణ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. అయ్యప్ప దీక్షను విరమించడానికి ఇటీవల ఆయన సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించాడు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. ధోని, చరణ్ లు ఇద్దరు కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. 2009లో రామ్ చరణ్, ఎంఎస్ ధోనీ కలిసి పెప్సీ యాడ్ షూట్ కోసం పని చేసిన విషయం తెలిసిందే. ఆ యాడ్ కు మంచి ఆదరణ లభించింది. ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటించాలని ఫ్యాన్స్ కూడా పలుసార్లు ప్రస్తావించారు. ధోనీ బయోపిక్ సినిమాలో సురేష్ రైనా పాత్రలో చరణ్ నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, అవి పుకార్లేనని తేలాయి.