Indian student Kill In US : అమెరికాలో భారతీయ డాక్టరల్ విద్యార్థి దారుణ హత్య గావించబడ్డాడు. ఒహియో రాష్ట్రంలో కారులో ఉన్న భారతీయ డాక్టరల్ విద్యార్థిని కాల్పి చంపారు. దీంతో అతను చదువుతున్న వైద్య విశ్వవిద్యాలయంలో విషాదం నెలకొంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల ఆదిత్య అద్లాఖా.. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ స్కూల్లో మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్లో నాల్గో సంవత్సరం డాక్టరల్ విద్యార్థిగా గుర్తించారు.
హామిల్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం అద్లాఖా నవంబర్ నెల ప్రారంభంలో యూసీ మెడికల్ సెంటర్లో మృతి చెందారు. నవంబర్ 9న వెస్ట్రన్ హిల్స్ వయాడక్ట్ ఎగువ డెక్లో గోడను ఢీకొట్టిన వాహనం లోపల ఉన్న వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారని సిన్సినాటి పోలీస్ లెఫ్టినెంట్ జోనాథన్ కన్నింగ్హామ్ తెలిపారు. ఉదయం 6:20 గంటల ప్రాంతంలో కారులో ఉన్న అతనిపై కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే కారులో ఓ వ్యక్తిని కాల్చి చంపినట్లు అటు వైపుగా వెళ్తున్న వాహన డ్రైవర్లు 911కి కాల్ చేసి సమాచారం ఇచ్చారని కన్నింగ్హామ్ పేర్కొన్నారు. ఆదిత్య అద్లాఖా వాహనం పలుమార్లు గోడను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్ పక్క కిటికీలో కనీసం మూడు బుల్లెట్ రంధ్రాలు కనిపించాయి.
అద్లాఖా పరిస్థితి విషమంగా ఉండటంతో యూసీ మెడికల్ సెంటర్కు తరలించారు. రెండు రోజుల తర్వాత చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా, కాల్పులు జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.