అస్సాంలో విషాధం నెలకొంది. ఆన్ లైన్ చదువు ప్రాణం తీసింది. ఆన్లైన్ చదువు కోసం స్మార్ట్ ఫోన్ లేదన్న మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంలోని చిరంగ్ జిల్లాకు చెందిన బాలుడు పదో తరగతి చదువుతున్నాడు.
అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ఆన్లైన్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.పేద కుటుంబానికి చెందిన అతడు స్మార్ట్ ఫోన్ లేక చదువు కొనసాగించలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై ఎస్పీ సుధాకర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ అతడిది నిరుపేద కుటుంబం. తల్లి ఉపాది కోసం బెంగళూరు పోయింది.
తండ్రి ఏ పనీ చేయటం లేదు. ఆన్లైన్ చదువుల కోసం స్మార్ట్ ఫోన్ అవసరమైంది. కానీ, తండ్రి అతడికి ఫోన్ కొనివ్వలేకపోయాడు. ఆ మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్క వారిని, మృతుడి మిత్రుల్ని విచారించాము. అతడి చావుకు కారణం ఆన్లైన్ చదువు కొనసాగించలేకపోవటమేనని తేలింది’’ అని వెల్లడించారు.