Hyderabad Drugs : న్యూ ఇయర్ వేడుకలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. హైదరాబాద్ కు భారీగా డ్రగ్స్ తరలిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు నిఘా పెంచారు. పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ ముఠాల భరతం పడుతున్నారు. డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేసి కేటుగాళ్లను జైలుకి పంపుతున్నారు.
ఈ నెల 21న సుమారు రూ.50 కోట్ల విలువైన 25 కిలోల మెఫిడ్రోన్ డ్రగ్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేసే రెండు ల్యాబ్స్ ను సీజ్ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. డ్రగ్స్ కార్యకలాపాలకు ప్రధాన సూత్రధారి రూ.60లక్షలతో నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన ఏడుగురు పాత నేరస్తులే అని పోలీసుల తెలిపారు.
మరోవైపు హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఆసిఫ్ నగర్ లో 31 కిలోల బరువున్న 164 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ కు చెందిన మహమ్మద్ జాఫర్ గంజాయి చాక్లెట్లను విక్రయించి డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రతి రెండు నెలలకు ఒకసారి బీహార్ వెళ్లి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లోని మెహదీపట్నంలో విక్రయిస్తున్నాడు జాఫర్.